యాదాద్రి భువనగిరి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అతను ఓ తాపీ మేస్త్రీ కొడుకు. డిగ్రీ వరకు చదివి నిరుద్యోగిగా ఉన్నాడు. కానీ ప్రతిభావంతులైన ఇంజినీర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ సృజనాత్మక ఆవిష్కరణతో అందరి మన్ననలు అందుకొంటున్నాడు. అతనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి గ్రామానికి చెందిన కుంచాల శివనాగరాజు (22). కరోనా కష్టకాలంలో అతను రూపొందించిన ‘ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్క్’ ( Nebuliser Mask ) అందరినీ ఔరా అనిపిస్తున్నది. వర్షంలోనూ ధరించేందుకు వీలుండటం దీని ప్రత్యేకత. మనతోపాటు ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా ఎంతో సౌకర్యవంతంగా రూపొందించిన ఈ మాస్క్ను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇంటింటా-ఇన్నోవేటర్’ కార్యక్రమంలోనూ ఈ మాస్క్ అత్యుత్తమ ఆవిష్కరణగా నిలిచింది. ప్రస్తుతం ఒక్కో ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్క్ తయారీకి రూ.670 ఖర్చవుతున్నదని, రానున్న రోజుల్లో దీన్ని రూ.500కే అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు చేస్తున్నానని శివనాగరాజు తెలిపారు.
సృజనాత్మక ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకోవడం శివనాగరాజుకు కొత్తేమి కాదు. ‘దిశ’ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడినప్పుడు అతను ఆవిష్కరించిన ‘స్టన్ గన్’ ఎన్నో మన్ననలు పొందింది. ఆపత్కాలంలో మహిళలు, యువతులకు ఆయుధంలా ఉపయోగపడేలా రూపొందించిన ఈ స్టన్ గన్కు ‘దండన’ అనే పేరు పెట్టారు. ఇది షాక్ను కలుగజేసే తుపాకీ లాంటి ఆయుధం. దీన్ని ఉపయోగించినపుడు ఎదుటి వ్యక్తికి ఎలాంటి ప్రమాదం కలుగదు. కానీ కొంతసేపటి వరకు నిశ్చేష్టులను చేస్తుంది. ‘దండన’తోపాటు మహిళా పోలీసులకు ఉపయోగపడేలా శివనాగరాజు రూపొందించిన ఎలక్ట్రిక్ లాఠీ, ఎలక్ట్రిక్ బైక్, మినీ ట్రాక్టర్ లాంటి ఆవిష్కరణలు అతని సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రోత్సాహం, ఆర్థిక సహకారం అందిస్తే ఎన్నో ఆవిష్కరణలకు పదునుపెడతా. ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్కుల ఉత్పత్తి కోసం పేటెంట్తోపాటు ట్రేడ్మార్క్ లైసెన్స్ను పొందా. స్టార్టప్ ఏర్పాటు కోసం టీహబ్, మీడియం అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కు దరఖాస్తు చేశా. రూ.10 లక్షల వరకు ఆర్థిక తోడ్పాటు లభిస్తే నాలాంటి ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నా. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే పేషెంట్లకు, అస్తమా రోగులకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లా ఉపయోగపడే ఎలక్ట్రిక్ నెబ్యులైజర్ మాస్క్ను అభివృద్ధి చేయాలన్నది ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం.
– కుంచాల శివనాగరాజు