నారాయణఖేడ్, జూలై 8 : పచ్చదనం, పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నారాయణఖేడ్ పట్టణంతోపాటు మండల పరిధిలోని రుద్రారం గ్రామాన్ని ఆయన సందర్శించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం నారాయణఖేడ్లో డంపింగ్యార్డు, వైకుంఠధామాలను పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలో పర్యటించి పారిశుధ్య పనులు, మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ రుబినాబేగం నజీబ్, జడ్పీటీసీ లక్ష్మీబాయి, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు ఉన్నారు.
పలు గ్రామాల్లో జడ్పీ సీఈవో పర్యటన..
నారాయణఖేడ్ మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ సీఈవో ఎల్లయ్య పర్యటించి పల్లె ప్రగతి, హరితహారం పనులను పర్యవేక్షించారు. సంజీవన్రావుపేట్, ర్యాకల్, పోతన్పల్లి, పలుగుతండాలను సంజీవన్రావుపేట్, ర్యాక ల్, పోతన్పల్లి, పలుగుతండాలను సందర్శించి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ చాందిబాయి చౌహాన్, జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్నాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు ఉన్నారు.
పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం..
న్యాల్కల్, జూలై 8 : పల్లె ప్రగతి, హరితహారంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రమైన న్యాల్కల్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఎస్సీ వాడలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడి ఉండడం, కలుపు మొక్కల తొలిగించకపోవడంతో పంచాయతీ కార్యదర్శి సుభాశ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా మురుగు కాల్వలను శుభ్రంగా చేయడం లేదని స్థానికులు జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. పరిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. అనంతరం మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. స్థానిక సర్పంచ్ కుమారుడు మశ్చేందర్ మాస్క్ ధరించకపోవడంతో రూ.వెయ్యి జరిమానా విధించారు. ఆయన వెంట మండల అభివృద్ధి అధికారి జగదీశ్వర్, పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు ఉన్నారు.
చెట్లతోనే పర్యావరణ పరిరక్షణ..
పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడుతాయని జహీరాబాద్ డివిజన్ పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ ప్రవీణ్కుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చినిగేపల్లి గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో రంగారావు, పీఆర్ ఏపీ రాంచందర్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల పరిశుభ్రం..
పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా మండలంలోని గినియార్పల్లి, కక్కర్వాడ, కప్పాడ్, తుమ్మన్పల్లి, వనంపల్లి తదితర గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతోపాటు పొలం గట్లపై ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు విజయ్కుమార్, శ్రీనివాస్, ఆనంద్, స్వప్న, ఇందిర, గీతాంజలి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి..
పరిసరాల పరిశుభ్రతపై ప్రతిఒక్కరూ దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్ నిర్మల సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు వార్డుల్లో కౌన్సిలర్లతో కలిసి ఆమె మొక్కలు నాటారు. అనంతరం సిబ్బందితో మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. కాలనీల్లోని చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు.
అందరి సహకారంతో పట్టణాభివృద్ధి..
అందరి సహకారంతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి విషయంలో తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి, హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైస్ చైర్మన్ ప్రవీణ్, కమిషనర్ నిర్మల, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ముమ్మరంగా పల్లె ప్రగతి..
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నది. మండల కేంద్రమైన హత్నూర, చీక్మద్దూర్, కాసాల, గోవిందరాజ్పల్లి, చింతల్చెరు, దౌల్తాబాద్, సిరిపుర తదితర గ్రామాల్లో మొక్కలు నాటడం, పారిశుధ్య పనులు, విద్యుత్ సమస్యను పరిష్కరించడం వంటి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. పల్లెప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలు పాల్గొంటున్నారు.
దిగ్విజయంగా పల్లె ప్రగతి..
నాలుగో విడుత పల్లెప్రగతి మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం దిగ్విజయంగా నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్వహణలో భాగంగా ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, రైతుల పొలాల వద్ద హరితహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.