కథల్లో నవ్యతతో పాటు వినోదానికి పెద్దపీట వేస్తూ అభిరుచిగల నిర్మాతగా తనదైన పంథాలో దూసుకుపోతున్నారు బన్నీ వాసు. నిర్మాతగా పదేళ్ల ప్రయాణంలో జీఏ2 పిక్చర్స్ను ఉత్తమ చిత్రాలకు చిరునామాగా నిలిపారాయన. 100పర్సెంట్ లవ్, పిల్లా నువ్వులేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీతగోవిందం వంటి విజయాలతో సత్తా చాటారు. నేడు నిర్మాత బన్నీ వాసు జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
రాబోవు రోజుల్లో యాభైశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను పునఃప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిస్తుందని భావిస్తున్నాం. అయితే కరోనా రెండో దశ సృష్టించిన భీభత్సం వల్ల ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. మునుపటిలా పూర్తిస్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అనిశ్చితి నేపథ్యంలో సినీరంగంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయలేకపోతున్నాం. అక్టోబర్ వరకు పరిస్థితులు పూర్తి సానుకూలంగా మారతాయని భావిస్తున్నాం. ఒకవేళ థర్డ్వేవ్ వస్తే మాత్రం థియేటర్లు పూర్తిస్థాయిలో పనిచేయడానికి వచ్చే ఏడాది జనవరి దాకా వేచిచూడాల్సిందే.
థియేటర్ కిక్ వేరు
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రేక్షకులు ఓటీటీల మీద ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. వాస్తవానికి థియేటర్, ఓటీటీ రిలీజ్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. థియేటర్లో సినిమా విజయం తాలూకు అనుభూతి తెలిసిన నిర్మాతలెవరూ ఓటీటీ విడుదలకు ప్రయత్నించరు. నిర్మాతలకు థియేటర్ రిలీజ్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అదే ఓటీటీ అయితే ఒక ఫిక్స్డ్ రేట్కు అమ్ముకోవాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాను ఎంతమంది వీక్షించినా ఆ లెక్కలతో నిర్మాతకు వచ్చే అదనపు ఆదాయం అంటూ ఏమీ ఉండదు. థియేటర్లో సినిమా విజయం సాధించడం..దాని తాలూకు సెలబ్రేషన్స్లో ఓ కిక్ ఉంటుంది. ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించినా ఆ ఫీల్ ఉండదు.
సినిమా కంటెంటే ప్రధానం
నిర్మాతగా మంచి సినిమాలు చేస్తున్నాననే సంతృప్తి ఉంది. ఫెయిల్యూర్స్ను ఓ పాఠంలా తీసుకొని తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటా. అయితే ఇప్పటివరకు నేను పర్ఫెక్ట్ మూవీ చేశానని మాత్రం అనుకోవడం లేదు. ప్రపంచం మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా చేయాలనే సంకల్పం ఉంది. సినిమా కంటెంట్ బాగుంటే లోకల్ సినిమా అయినా గ్లోబల్గా పేరు తెచ్చుకుంటుందని నేను బలంగా నమ్ముతాను. అల్లు అర్జున్తో జీఏ2 బ్యానర్లో తప్పకుండా సినిమా ఉంటుంది. బన్నీతో మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న కథను చేయాలనుంది. రాబోవు రెండేళ్లలో అల్లు అర్జున్తో సినిమా ఉంటుంది. ప్రస్తుతం అల్లు శిరీష్ కథానాయకుడిగా మా సంస్థ ఓ సినిమా చేస్తోంది. దీనితో పాటు శ్రీకాకుళం నేపథ్యంలో ఓ కథ ఓకే చేశాం. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. వచ్చే ఏడాది మా సంస్థ నుంచి ఏడెనిమిది సినిమాలు తీసుకు రావాలనే కృతనిశ్చయంతో ఉన్నాం.