మెదక్, మే 20 : మెదక్ జిల్లాలో కరోనా మందులు, ఆక్సిజన్కు కొరత లేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. మెదక్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కొవిడ్, ధాన్యం కొనుగోళ్లపై గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో వంద మంది, ప్రైవేటు దవాఖానల్లో 206 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 743 మంది రోగులకు రెమెడిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చామని , ఇంకా 219 అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ , ప్రైవేటు దవాఖానల్లో రెమెడిసివిర్, ఆక్సిజన్ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ లేనందున ఉచితంగా ఆక్సిజన్ను జిల్లాకు అందజేయాల్సిందిగా మెగా సంస్థను కోరామన్నారు.పీహెచ్సీల్లో 3,550 ఆర్టీపీసీఆర్, 2,275 ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయుష్మాన్ కింద 10 మంది వైద్యులు, 20 మంది నర్సులను వెంటనే భర్తీ చేసి కరోనా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్వోను మంత్రి ఆదేశించారు.
టీకాలు వేస్తాం…
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 10 లక్షల కోవాగ్జిన్ టీకాలు కొనుగోలు చేయనుందని, 18-45 ఏండ్లలోపు వయస్సు గల ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లు, రేషన్ డీలర్లు, కూరగాయలు, పండ్ల దుకాణా, మాంసం దుకాణాల వ్యాపారులు, పేపర్ బాయ్స్, తదితరులకు టీకా వేస్తామని తెలిపారు. అలాంటి వారు జిల్లాలో ఎంతమంది ఉన్నారో గుర్తించాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. ఇంటింటి జ్వర సర్వేలో స్వల్ప లక్షణాలతో బాధపడుచున్న 7వేల మందిని గుర్తించి, 8 రకాల మందుల కిట్, ప్రిస్కిప్షన్ ఇచ్చామని, అందులో 4వేల మంది కోలుకున్నారని , మరో 3,067 మంది ఐసొలేషన్లో ఉన్నారని, వారిని రోజు ఫోన్ ద్వారా పలకరించి ధైర్యం చెప్పాలని వైద్యసిబ్బందికి మంత్రి సూచించారు. గతంలో ర్యాండమ్గా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 24శాతం పాజిటివ్ కేసులు వచ్చేవని , నేడు ఇంటింటి సర్వే ద్వారా కొవిడ్ లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు నిర్వహించి ఐసొలేషన్ చేసి కట్టడి చేయడం ద్వారా, 11 శాతానికి కేసులు తగ్గాయన్నారు. 5 మరణాల శాతం తగ్గిందన్నారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తే జిల్లాలో కరోనాను పూర్తిగా కట్టడి చేయవచ్చని అన్నారు.
జోరుగా ధాన్యం కొనుగోళ్లు..
మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, లారీల కొరత ఉన్నందున హమాలీలు పెట్టుకొని ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలిస్తున్న రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సంగారెడ్డి జిల్లా రైస్మిల్లర్లు తీసుకునేలా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్కు సూచించారు. బోధన్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో భద్రపరుస్తున్న ధాన్యం వెంటనే లిఫ్ట్ చేయవల్సింగా కోరారు. జిల్లాకు 60 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయని, సరఫరా చేయాలని కోరారు. ఇంకా రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం భద్రపరచుటకు రైతు వేదికలు , పాఠశాలలు, కళాశాలలు, ఫంక్షన్ హాల్ తదితర వాటిని ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. అంతకు ముందు టీఎస్పీఎస్సీ సభ్యుడు ఆర్.సత్యనారాయణను మంత్రి , ఎమ్మెల్యే సన్మానించారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.హరీశ్, అదనపు కలెక్టర్ జి.రమేశ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి , మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ , ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, టీఎస్పీఎస్సీ సభ్యుడు ఆర్.సత్యనారాయణ, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.