ముంబై : మూడో దశ టీకాల పంపిణీ ప్రారంభానికి ముందే మహారాష్ట్రని ముంబైలో వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ముంబైలో టీకాల పంపిణీ ఉండదని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. 18-45 ఏళ్ల వ్యక్తులకు మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్లు వేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసింది. కరోనా సెకండ్ వేవ్లో ఎక్కువగా యువతే మహమ్మారి బారినపడుతుండడంతో కేంద్రం వారికి సైతం వ్యాక్సిన్లు వేయాలని భావిస్తోంది. అయితే, వ్యాక్సిన్ల కొరత కారణంగా 18-45 ఏళ్ల వ్యక్తులకు వ్యాక్సినేషన్ ఆలస్యమవుతుందని అధికారులు తెలిపారు. టీకాల కొరత కారణంగా ముంబైలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు టీకాల పంపిణీ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు బీఎంసీ నోటీసులో పేర్కొంది.
స్టాక్ వస్తే ప్రజలకు మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ఇస్తామని తెలిపింది. టీకా కేంద్రాల వద్ద గుమిగూడొద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ టీకా వేస్తామని స్పష్టం చేసింది. 18-45 ఏళ్ల మధ్య లబ్ధిదారులకు తగినంత టీకాలు లభించిన తర్వాతే పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ‘సరిగ్గా మే ఒకటిన కాదు’ అని బృహన్ ముంబై కార్పొరేషన్ అదనపు మున్సిపల్ కమిషనర్ అశ్విని భిడే ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1.55 కోట్లకుపైగా వ్యాక్సిన్లు వేశారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో నిన్న ఒకే రోజు 66,159 కొవిడ్ కేసులు రికార్డవగా.. 771 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.