నల్లగొండ: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రా నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఈ-పాస్ అనుమతి తప్పనిసరని, లాక్డౌన్ మినహాయింపు సమయంలో కూడా ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లకు, ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ-పాస్ లేని వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ, రామాపురం వద్ద, నల్లగొండ జిల్లా వాడపల్లి, నాగార్జునసాగర్ల వద్ద రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు చేక్ పోస్టుల వద్ద ఈ-పాస్లేని వాహనాలను అడ్డుకుంటున్నారు.
దీంతో సరిహద్దుల్లో ఉదయం నుంచి ఆంధ్ర ప్రాంతం వైపు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అలాగే మేల్లచెరువు, చితలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో ఉన్న ఆంధ్ర-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దుల్లో అత్యవసర సేవలు మినహాయించి ఇతర సాధారణ రాకపోకలను 24 గంటలు నిషేదిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ ప్రకటించారు. కొంత మంది వాహనదారులు, ప్రజలు లాక్డౌన్ మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారని, అలాగే ఆంధ్రా నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఉదయం 4 నుంచి 6 గంటలోపు రామాపురం ఎక్స్రోడ్ అంతరాష్ట్ర చెక్ పోస్టుకు చేరుకుటున్నారని, 6 గంటల తర్వాత తెలంగాణలోకి వస్తున్నారని చెప్పారు. దీంతో వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున ఆంక్షలను కఠినతరం చేశామన్నారు. రాష్ట్రంలోకి రావాలంటే ఏసమయంలోనైనా ఈ-పాస్ ఉండాలని తెలిపారు. దీనిని ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.