అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ గత మంగళవారం ‘స్ప్రింగ్ ఈవెంట్-2021’ పేరిట నిర్వహించిన
కార్యక్రమంలో పలు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. యాపిల్ ఉత్పత్తుల్లో బెస్ట్ సెల్లర్గా నిలిచిన ఐఫోన్ 12 (రూ.79,900), ఐఫోన్ 12 మినీ (రూ.69,900) హ్యాండ్సెట్లను పర్పుల్ కలర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్పుల్ కలర్ ఐఫోన్ల బుకింగ్ భారత్లో ప్రారంభమైంది. ఆర్డర్ చేసిన వినియోగదారులకు ఈనెల 30 నుంచి ఫోన్లు డెలివరీలు చేయనున్నారు. కొత్త కలర్ వేరియంట్ సేల్ మార్కెట్లో ఏప్రిల్ 30న మొదలవుతుంది.
మరోవైపు ఎం-1 చిప్తో పనిచేసే సరికొత్త ఐమ్యాక్ డెస్క్టాప్ కంప్యూటర్ను కూడా యాపిల్ ఆవిష్కరించింది. మూడు రకాల స్టోరేజీ ఆప్షన్లలో లభ్యమయ్యే ఈ డెస్క్టాప్ బేస్ వేరియంట్ ధరను రూ.1,19,900గా నిర్ణయించింది. 24 అంగుళాల 4.5కే రెటీనా డిస్ప్లేతో కూడిన కొత్త ఐమ్యాక్లో 7-కోర్ జీపీయూ, 1080పీ ఫేస్టైమ్ హెచ్డీ కెమేరా, స్టూడియో క్వాలిటీ మైక్స్, సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, టచ్ ఐడీ లాంటి ప్రత్యేక ఫీచర్లున్నాయి.