కరోనా విషయంలో తెలంగాణకు అన్యాయం
కేంద్రం బడ్జెట్లో రాష్ర్టానికి కోత పెట్టింది
తెలంగాణలోని గ్రామాలు దేశానికే ఆదర్శం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, ఏప్రిల్ 24 : తెలంగాణ రాష్ట్రంలో స్థాని క సంస్థలకు 12 అవార్డులు రావడం హర్షణీయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మం త్రి నరేంద్రమోదీ అవార్డులు అందజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఒక జిల్లా పరిషత్, రెండు మండల పరిషత్లు, 9 గ్రామ పంచాయతీలకు కలిపి మొత్తం 12 అవార్డులు వచ్చాయన్నారు. జలజీవన్ పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రారంభించకముందే తెలంగాణలో మిషన్ భగీరథ ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చూసి దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలుచేస్తున్నారన్నా రు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 39వేల కోట్లు మిషన్ భగీరథకు ఖర్చుచేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల పార్లమెంట్లో కేంద్ర మంత్రి సైతం పార్లమెంట్లో తెలంగాణలోని నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. చాలా విషయాలను ప్రధానమంత్రి తెలియజేశారని, వాటన్నింటిని రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయా న్ని ఇప్పటికే సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్లు కేంద్రానికి లేఖలు కూడా రాశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యే వ్యాక్సిన్ను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకొని మనకు అవసరం మేరకు ఇవ్వడం లేదన్నారు.
ప్రస్తుతం ఇస్తున్న కోటాకంటే ఎక్కువగా ఇవ్వాలని మంత్రి కోరారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు రోగులు వస్తున్నారని వారిని కూడా ఆదరించి వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రతి సంవత్సరం నిధులు ఇస్తుందని, ఈ సంవత్సరం బడ్జెట్లో కోత పెట్టడం బాధాకరం అని మంత్రి తెలిపా రు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గ్రామ పంచాయతీలను పటిష్టం చేసేందుకు గాను కేం ద్రం వాటాకు సమానంగా ప్రతి నెల గ్రామ పంచాయతీలకు రాష్ట్రం నుంచి రూ.330 కోట్లు నిధులు ఇస్తున్న ట్లు తెలిపారు. దేశంలో ప్రతినెలా గ్రామ పంచాయతీల కు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లా, మండల పరిషత్లకు నిధులు ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాం తాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటి కి నిధులు ఇస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణే అన్నారు.
ఈ క్రమంలో గిరిజన సర్పంచుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. రాష్ర్టానికి గతేడాది, ఈ ఏడాది అవార్డులు వచ్చాయని వాటితో పాటు నిధులు కూడా ఎక్కువగా ఇవ్వాలని మంత్రి.. ప్రధాని, కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గతంలో వరంగల్ జిల్లాలోని ఒక గంగదేవిపల్లె మాత్రమే ఆదర్శ గ్రామంగా ఉండేదని, సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్ర మం చేపట్టి రాష్ట్రంలోని అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలిచి అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి దేశంలో ఏ రాష్ర్టానికి రానన్ని అవార్డులు, ప్రశంసలు తెలంగాణకు దక్కాయ ని, రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవతుందనడానికి ఈ అవార్డులు, ప్రశంసలే నిదర్శనమని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఢిల్లీ నుం చి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మం త్రి నరేంద్రసింగ్ తోమర్, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు.