నాలుగు రోజులైతే రైతులే మరిచిపోతారు…
అంతవరకు మౌనంగా ఉండాలంటూ శ్రేణులకు బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం
కేంద్ర ప్రకటనపై నిరసనలు వ్యక్తమైనా నోరెత్తని నేతలు
కర్షకుల ఆగ్రహంతో కాషాయ పార్టీలో గుంభనం
హామీ నెరవేర్చే దాకా వదిలేది లేదంటున్న పసుపు రైతులు
గల్లీలో ఓ రకంగా, ఢిల్లీలో మరోరకంగా.. అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు
ఎంపీ అర్వింద్ను వెంటాడుతున్న రాజీనామా గుబులు
నిజామాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం ససేమిరా అనడంతో రైతుల్లో పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోర్డు తప్ప తమకేదీ ప్రత్యామ్నాయం కాదని వారు కుండబద్దలు కొడుతున్నారు. పసుపు రైతుల నుంచి ఊహించని విధంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ కొత్త ఎత్తుగడకు సిద్ధమైనట్లు సమాచారం. పసుపు బోర్డు ప్రకటనపై బీజేపీ నాయకులు, శ్రేణులు ఏమీ మాట్లాడవద్దంటూ అధిష్ఠానం ఆదేశించినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. రైతుల నిరసనలపై స్పందించకుండా ఉంటూ.. పసుపు బోర్డు అంశాన్ని వ్యూహాత్మకంగా మరుగున వేయాలని బీజేపీ భావిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. మరోవైపు పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీరుపై సొంత పార్టీలోనూ వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నది. అనవసరంగా రైతులను అర్వింద్ రెచ్చగొట్టి.. పార్టీని బద్నాం చేస్తున్నారని వారు మండిపడుతున్నట్లు సమాచారం.
పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం ససేమిరా అనడంతో ఉత్తర తెలంగాణలో పసుపు రైతులు భగ్గుమంటున్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రైతులంతా భీష్మించుకుని కూర్చున్నారు. బోర్డు తప్ప తమకేదీ ప్రత్యామ్నాయం కాదంటూ కుండ బద్దలు కొడుతున్నారు. కర్షక లోకం నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్న వేళ బీజేపీ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రైతులను పసుపు బోర్డు నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త ఎత్తుగడకు సిద్ధమైందని సమాచారం. పసుపు బోర్డు ప్రకటనపై బీజేపీ నేతలెవరూ స్పందించవద్దని, శ్రేణులు కూడా ఎవరూ మా ట్లాడొద్దంటూ ఆదేశాలు జారీ అయినట్లు కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. రైతుల నిరసనలపై స్పం దించకుండా ఉండడం ద్వారా కాలక్రమేణా పసుపు బోర్డు అంశాన్ని మరుగున వేయాలని బీజేపీ చూస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. పార్లమెంట్లో పసుపు బోర్డు పెట్టేది లేదని కేంద్రం చేసిన ప్రకటనను సమర్థించుకునేలా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తుండడాన్ని రైతులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అర్వింద్పై సొంతపార్టీ నేతల ఆగ్రహం
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీరుపై సొంత పార్టీలోనూ నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయిన బీజేపీ ఇందూరు శాఖలో పాత నాయకులు ఎంపీని పరుష పదజాలంతో దూషిస్తున్నట్లుగా తెలిసింది. అనవసరంగా రైతులను రెచ్చగొట్టి పార్టీని బద్నాం చేస్తున్నారని ఆయనపై మండిపడుతున్నట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారే అన్నీ తామై వ్యవహరిస్తుండడంపై ముందు నుంచి గుర్రుగా ఉన్న పాత నాయకులంతా ఎంపీ వైఫల్యాలపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పసుపు బోర్డు రాదనే సంగతి ముందే తెలిసినప్పటికీ రైతులను మోసం చేయడం తగదంటూ సొంత పార్టీలో చర్చ జరగడం ఎంపీ అర్వింద్కు తలనొప్పిగా మారింది. బీజేపీలో సాధారణ ఎన్నికల ముందు ప్రవేశించి ఎంపీ టికెట్ పొందిన అర్వింద్కు ఆ పార్టీ సిద్ధాంతాలు, సైద్ధాంతిక అంశాలపై ఎలాంటి అవగాహన లేదంటూ మండిపడుతున్నారు. ఇందుకు డి.శ్రీనివాస్తో ఢిల్లీ విమాన ప్రయాణంలో ఫొటో దిగి షేర్ చేసిన పోస్టు కారణంగా నిలుస్తోంది. డీఎస్పై పోరాటం చేసిన బీజేపీలోని ఓవర్గం పాత నాయకులు అర్వింద్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు డీఎస్కు ఓ వర్గంలో తీవ్రమైన ప్రభావం ఉంది. అదే వర్గాన్ని బీజేపీ ఎంపీగా అర్వింద్ పదే పదే చులకన చేస్తూ నిందిస్తున్నాడు. ద్వంద్వ నీతికి పరాకాష్టగా చేరిన ధర్మపురి కుటుంబం మారిందన్న కోణంలో సొంత పార్టీలోనే అర్వింద్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం చేసుడ్రా బై…
ఇదిలా ఉండగా ఎంపీ అర్వింద్ తాజా పరిస్థితిపై తన సన్నిహితులతో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైతుల ఆగ్రహావేశాలు నిజామాబాద్ లోక్సభ పరిధిలో కట్టలు తెంచుకోవడంతో తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారి చెంత రాజకీయ గుబులును వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ‘ఏం చేసుడో అర్థమైతలేదు. రైతులేమో రాజీనామా అంటుండ్రు. కేంద్రం మొదట్నుంచి బోర్డు ఇవ్వనంటుంది. మనం ఇప్పుడు ప్రజల్లోకి ఎట్లా పోవుడు. రైతులను ఎలా నమ్మించుడు. ఎక్స్టెన్షన్ ఆఫీస్ అంటే ఎవ్వరూ నమ్ముతలేరు… అంటూ ఢిల్లీలో తన నివాసంలో ఎంపీ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ‘పసుపు బోర్డు కేంద్రం ఇవ్వదని నాకు తెలుసు. కాకపోతే ఎలాగైనా ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే పట్టించుకుంటరు అనుకున్నా. రైతులను నమ్మించి ఓట్లు వేయించుకున్నం. ఇప్పుడు బోర్డు ఇవ్వనంటే మన పరిస్థితి అర్థం అయితలేదు..’ అంటూ అర్వింద్ మల్లగుల్లాలు పడుతున్నట్లు ఢిల్లీలోని మీడియా వర్గాలు సైతం గుసగుసలాడుతుండడం గమనార్హం. తెలంగాణలో ప్రతి అంశంపై నోరు పారేసుకునే అర్వింద్ మాటలను కేంద్రమే పట్టించుకోవడం లేదనే సంకేతాలు బలంగా చొచ్చుకెళ్తున్నాయి.
గల్లీలో ఒకలా.. ఢిల్లీలో మరోలా…
నిజామాబాద్ జిల్లాకు నెలకోసారి పర్యటనకు వచ్చినప్పుడల్లా ఎంపీ అర్వింద్ తనదైన శైలిలో ప్రజల శ్రేయస్సుకు సంబంధం లేని అంశాలపై ప్రసంగాలిస్తుంటారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులను పరుష పదజాలంతో నిందించడం, గౌరవ మర్యాదలు మరిచి తిట్ల దండకం ఎత్తుకోవడం రెండేండ్లుగా జనాలంతా చూస్తున్నదే. భారీ ప్రకటనలు చేయడం, సంచలన కామెంట్లతో బ్రేకింగ్ న్యూస్లో నిలించేందుకు ఆసక్తి చూపే అర్వింద్కు ఢిల్లీలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం నోరు లెవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పెరుగుతున్నాయి. బోర్డు తెస్తానని చెప్పి బీజేపీ, ఎంపీ అర్వింద్ మోసం చేయడంతో జీర్ణించుకోలేని పసుపు రైతులు, వారి కుటుంబాలు రోజూ ఆయనపై సోషల్ మీడియా అకౌంట్లలో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.