సిద్దిపేట : త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలను విడుదల చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని రంగధాంపల్లిలో సుతారి సంఘం, మహిళా మండలి భవనం, ముదిరాజ్ సంఘం భవనాన్నిమంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రంగాధాం పల్లిలో 12 కుల సంఘాల భవనాలు నిర్మించామని తెలిపారు. 9వ మున్సిపల్ వార్డులో రూ.9 కోట్లు నిధులతో వివిధ అభివృద్ది పనులను చేశామన్నారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ లకు బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహలుగా మార్చాయని విమర్శించారు. స్థానిక సంస్థల బలోపేతం కోసమే నిధులు కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు రూ.699 కోట్లు కోత పెడితే రాష్ట్ర ప్రభుత్వం కడుపు నింపిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెల రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్లు రావడం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.