సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం 6:30 గంటలకు ఎన్నికల పరిశీలకులు హరిప్రీత్సింగ్, రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల, అభ్యర్థుల సమక్షంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్కుమార్ స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేశారు. 7.30 వరకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ల సీల్ పరిశీలన అనంతరం కౌంటింగ్ టేబుళ్లపైకి బాక్స్లను తరలించారు. 8 గంటలకు బ్యాలెట్ పేపర్లను డ్రమ్ములో కలిపి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ కట్టారు. ఒక్కో టేబుల్పై ఒక బూత్ బాక్స్ను తెరిచి పోలైన ఓట్లు, బ్యాలెట్ పత్రాలు సమానంగా ఉన్నాయా..? లేదా..? అన్నది పరిశీలించారు. అనంతరం వాటిని 25 చొప్పున బండిల్గా కట్టారు.
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
ఓట్ల లెక్కింపులో భాగంగా ఎనిమిది హాల్స్.. ఒక్కో హా ల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 56 ఏర్పాటు చేశారు. టేబుల్కు వెయ్యి చొప్పున 56 వేల ఓట్లను ఏకకాలంలో లెక్కించనున్నారు. ఏడు రౌండ్ల వారీగా ఓట్ల లెక్కిం పు జరగనున్నది. రాత్రి 11 గంటల తర్వాత ఓట్లు లెక్కించారు. బరిలో 93 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రతి అభ్యర్థికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎన్ని వచ్చాయి..? చెల్లని ఓట్లు ఎన్ని..? అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జంబో బ్యాలెట్ పేపర్ అయినందున ఒక్కో బ్యాలెట్ పత్రాన్ని పరిశీలించేందుకు దాదాపు 2-3 నిమిషాల వ్యవధి పడుతున్నది. 12 గంటలకో షిఫ్టు వారీగా రెండు విడుతల్లో సిబ్బంది పని చేస్తున్నారు.
చెల్లుబాటు అయిన ఓట్లలో సగం కంటే ఒక ఓటు (మొదటి ప్రాధాన్య త) ఎక్కువగా వస్తే.. ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ.. వారికి వచ్చిన రెండో ప్రాధాన్యతను ఆయా అభ్యర్థులకు కలుపుతారు. అలా దిగువ నుంచి ఎగువకు ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహిస్తూ కోటా ఓట్లు (చెల్లిన ఓట్లలో 50 శాతం ప్లస్ ఒక ఓటు) వచ్చే దాకా కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ ప్రక్రియలో కోటా ఓట్లు ఏ అభ్యర్థికి వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. కాగా, రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే మాత్రం కౌంటింగ్ పూర్తయ్యేందుకు మరో రెండు రోజులు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.