నగరంలోని శ్మశానవాటికకు మెరుగులు
రూ.75 లక్షల నిధులతో శరవేగంగా పనులు
అందుబాటులోకి ఐదు దహన వేదికలు
త్వరలో ప్రారంభోత్సవం
ఖమ్మం, మార్చి 17 : ఆఖరి మజిలీకి కష్టాలు తీరనున్నాయి.. గతంలో నగరంలో ఎవరైనా మృతిచెందితే దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వైకుంఠధామాలు నిర్మిస్తున్నది. మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని సౌకర్యాలతో శ్మశాన వాటిక పనులను పూర్తి చేయిస్తున్నారు. రూ.75 లక్షలతో నిర్మిస్తున్న ఖమ్మం నగరం సమీపంలోని కాల్వొడ్డు శ్మశాన వాటిక త్వరలో అందుబాటులోకి రానుంది.
కటిక పేదరికం అనుభవించిన వారైనా.. ఐైష్టెశ్యర్యాలు ఉన్న సంపన్నుడైనా.. చివరికి మృత్యువు ఒడికి చేరుకోవాల్సిందే.. ‘ఆఖరి మజిలీ’లో వారికి కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి, గౌరవప్రదంగా సాగనంపాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నది. దీనిలో భాగంగా ఖమ్మం నగరంలోని కాల్వొడ్డులోని హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తున్నది. గతంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఉండేవి. అన్ని సౌకర్యాలతో శ్మశాన వాటిక అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక చొరవతో పనులు పూర్తి చేయిస్తున్నారు. నగరపాలక సంస్థ విడుదల చేసిన రూ.75 లక్షల నిధులతో పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా శివుడి విగ్రహం..
శ్మశానవాటికలో ఏర్పాటు చేసిన 20 అడుగుల శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నది. నగరపాలక సంస్థ అధికారులు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఇక్కడ గతంలో కంటే భిన్నంగా ఐదు దహన వేదికలను నిర్మించారు. గతంలో మృతదేహాన్ని దహనం చేసే సమయంలో భూమిపైనే కట్టెలు ఉంచి కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించేవారు. ఇప్పుడు దహనం చేయడానికి ఐదు స్టాండులు ఏర్పాటు చేశారు. అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు వృద్ధులు, దివ్యాంగులు కూర్చోవడానికి ప్రత్యేక గ్యాలరీ నిర్మించారు. వీటితో పాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, కేశఖండనానికి ప్రత్యేక భవనం అందబాటులోకి వచ్చాయి. శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. వీలైన ప్రతి చోట మొక్కల పెంపకం చేపడుతున్నారు. ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయడానికి పార్కింగ్ స్థలం సైతం ఏర్పాటు చేశారు.
నైజాంకాలం నాటి శ్మశానవాటిక..
నగరంలోని మున్నేరు పక్కన ఉన్న ఈ శ్మశాన వాటిక నైజాంకాలంలో ఏర్పాటైంది. నాటి పట్టణ జనాభాకు అనుకూలంగా ఈ ప్రదేశం ఎంపికైంది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్మశాన వాటికలో మరిన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత అప్పటి రాజ్యసభ సభ్యుడు వై.రాధాకృష్ణమూర్తి, మున్సిపల్ చైర్మన్ చిర్రావూరి లక్ష్మీనర్సయ్య కృషి కారణంగా శ్మశాన వాటికలో నీటి సదుపాయం, ఖర్మకాండలు, నిర్వహించే స్థలం సమకూరాయి. కొన్నేళ్ల తర్వాత ఆర్యవైశ్య సంఘం నాయకులు చొరవతో శ్మశాన వాటిక ముందు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మింపజేశారు. దీనిపై వచ్చే ఆదాయాన్ని మున్సిపల్ అధికారులు శ్మశాన వాటిక అభివృద్ధికి వినియోగించేవారు.