జహీరాబాద్/రాయపోల్/వెల్దుర్తి, డిసెంబర్ 8 : చలికాలం వ్యాధులు ముసిరే కాలం. కొద్ది రోజులుగా రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో సాధారణ ఉష్ణాగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చలి పెరిగినప్పుడు గాలిలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు త్వరగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డిసెంబర్, జనవరిలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చలికాలంలో వ్యాధులు దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం..
ఆహారంలో మార్పులు అవసరం..
చర్మ రక్షణకు జాగ్రత్తలు…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వేడి ఆహార పదార్థాలు మేలు
శీతాకాలంలో జలుబు, చర్మవ్యాధులు, శ్వాసకోశ, నిమోనియా లాంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధారణ జలుబును నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన నిమోనియా సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. జలుబు లక్షణాలు కనిపిస్తే సిట్రజిన్, ప్యారసిటమాల్ను మాత్రమే వాడాలి. యాంటీబయాటిక్ మాత్రలు వేసుకోవడం శ్రేయస్కరం కాదు. చిన్న పిల్లలకు జలుబు చేస్తే ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేయొద్దు. ఆస్తమా ఉన్న వారు చలిలో బయటకు వెళ్లకుండా చూడాలి. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఇంట్లో దోమలు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఉద యం వేళ్లలో వాకింగ్కు వెళ్లే వారు చర్మాన్ని కప్పి ఉండే దుస్తులతో బయటకు వెళ్లాలి. లోదుస్తులను ఉతక్కుండా ధరిస్తే గజ్జి, తామర లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
-డాక్టర్ సీతారామరాజు, జనరల్ వైద్య నిపుణుడు ఏరియా దవాఖాన జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)
చలికాలంలో ప్రతిఒక్కరూ కొద్దిపాటి వ్యాయామం చేయాలి. గోరువెచ్చని నీళ్లు తాగడం, సాధ్యమైనంత వరకు వేడి ఆహార పదార్థాలు తినాలి. బయటకు వెళ్లాల్సి వస్తే రగ్గులు, మాస్కులు, ధరించాలి. సొరియాసిస్ ఉన్న వారికి ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. వాతావరణ మార్పులతో ప్రస్తుతం అంతటా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటి గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. చలికాలంలో మలేరియా, డెంగీ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో దోమలు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి.
డాక్టర్ శ్రీధర్, రాయపోల్ పీహెచ్సీ వైద్యాధికారి(సిద్దిపేట జిల్లా)
రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతున్నది. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో రాత్రి అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, చలి నుంచి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి పండ్లు తినాలి, ఏ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి అనే అంశాలను వివరిస్తున్నారు. అలాగే, చర్మరక్షణ కోసం సన్స్కీన్ లోషన్లతో పాటు ఇంట్లోనే పాటించగలిగే చిన్న చిన్న చిట్కాలను చెబుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రజలుతున్న నేపథ్యంలో ఎవరూ భయాందోళనకు గురికాకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.