రేవంత్రెడ్డిని ప్రశ్నించిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్ : వంద కోట్ల విలువైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మిందెవరూ.. 2001లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కాదా అని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. శనివారం ఆయన జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వారికి విక్రయించి తెలుగుదేశం పార్టీ చెరుకు రైతులకు తీవ్ర నష్టం చేసిందని మండిపడ్డారు. శుక్రవారం జహీరాబాద్లో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వచ్చిన రేవంత్రెడ్డి దళిత ఎమ్మెల్యేనైన తనకు చెరుకు రైతుల గురించి అవగాహన లేదనడం దళితులను అవమానించడమేనన్నారు. తాను ఒక రైతునేనని స్పష్టం చేశారు.
రూ.వందకోట్ల విలువైన ఫ్యాక్టరీని కేవలం రూ.18కోట్లకు విక్రయించారని మండిపడ్డారు.
అదేవిధంగా ఫ్యాక్టరీకి సంబంధించిన 17వేల ఎకరాలను కూడా విక్రయించారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి రైతులను మోసం చేశాయన్నారు. దొంగే.. దొంగ, దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ సమావేశంలో సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.