సంగారెడ్డి : పిడుగుపాటుకు తల్లిదండ్రులు మృతిచెందిన దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మనుర్ తాండాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి వర్ష సూచన నేపథ్యంలో నుర్పిడి చేసిన జొన్న పంటను కాపాడుకునేందుకు దానిపై టార్పాలిన్ కప్పేందుకని లంబాడా దంపతులిద్దరూ తమ ముగ్గురు పిల్లలను ఇంట్లోనే వదిలి పొలం వద్దకి వెళ్లారు.
కాగా గురువారం ఉదయం పొలాలకు వచ్చిన పొరుగు రైతులు పంట కుప్పపై దంపతులిద్దరూ చనిపోయి ఉండటాన్ని గమనించారు. పిడుగుపాటుకి భార్యభర్తలు కిషన్ నాయక్(45), కొమిని బాయి(39) మృతిచెందినట్లుగా తెలిపారు. మృతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఏకకాలంలో తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారుల పరిస్థితిని చూసి గ్రామం దుఃఖంలో మునిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.