సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు
సంగారెడ్డి : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను త్వరలోనే ప్రారంభించటం జరుగుతుందని, పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించుకునే బాధ్యత మీదే అని సీఎం కేసీఆర్ జిల్లా మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావులకు సూచించారు.
ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలో అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు శాసనసభలో సీఎం కేసీఆర్ను శుక్రవారం కలిశారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు ఇవ్వటంపై ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు, రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కొన్నివేల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు జిల్లా ఎమ్మెల్యేలను అభినందించారు.
త్వరలోనే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను ప్రారంభిస్తామని, ఆ పనులను త్వరగా పూర్తి అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని సీఎం సూచించారు. ఆర్థిక మంత్రి హరీశ్రావుకు ఉన్న అనుభవాన్ని వాడుకోవాలని, ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ పనులు పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యేలకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు సీఎం కేసీఆర్తో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సాగునీటి విషయంలో ఎంతో వివక్షకు గురైందని, రైతులపై మీకున్న ప్రేమ, దీర్ఘదృషి ఫలితంగా సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని కొనియాడారు.
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు వివరించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం రూ.4474 కోట్ల నిధులు కేటాయించటంతోపాటు సత్వరం పరిపాలన అనుమతులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా రైతులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేసిన అనంతరం అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కొద్దిసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో అందోలు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని, మీ వల్లే ఇది సాధ్యమైందంటూ సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అందోలు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువస్తున్నందున తన నియోజకవర్గ ప్రజలు, రైతులు ఎంతో రుణపడి ఉంటారని తెలియజేశారు. సీఎం కేసీఆర్ స్పందిస్తూ ‘అందోల్ ప్రజల చిరకాల స్వప్నమైన సాగునీటిని అందించటంలో నీవు భాగస్యామ్యం అవుతున్నందున ధన్యడవు…అందోలు ప్రజల ఆదరణ ఎల్లకాలం నీకు ఉంటుందని’ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ భుజం తట్టారు.