సదాశివపేట : ఉపాధ్యాయులు డిజిటల్ విద్యావిధానాన్ని అలవర్చుకోవాలని సంగారెడ్డి డీఈవో రాజేశ్ అన్నారు. శుక్రవారం ఆయన సదాశివపేటలోని కస్తూర్బాగాంధీ పాఠశాలకు పెస్పీకో, నిర్మాణ్ సంస్థ సభ్యులు బహూకరించిన 14 కంప్యూటర్లు, ఒక టీవీని పెస్పీకో ప్రతినిధి అవంతికా నిగమ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కూడా డిజిటల్ విధానంతోనే జరుగుతున్నాయని అందువల్ల టీచర్లు డిజిటల్ విద్యావిధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ఆయన పెస్పీకో సభ్యులతో మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ పాఠశాలలకు కంప్యూటర్లు ఇవ్వడం సంతోషకరమని, కానీ వాటిని ఇచ్చే సందర్భంలో డీఈఓను సంప్రదించాలని సూచించారు. ప్రాధాన్యతాక్రమంలో ఏ పాఠశాలలో ఏ అవసరం ఉంటుందో డీఈఓకు తెలుస్తుందని, దాని ప్రకారం అవసరం ఉన్నచోట ఇచ్చే విరాళాలను సద్వినియోగం చేసుకుంటామన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులు..
నేటి బాలలే రేపటి పౌరులని పెప్సీకో ప్రతినిధి అవంతికానిగమ్ అన్నారు. బాలికలకు విద్యనందించడంతో పాటు డిజిటల్ విద్యావిధానాన్ని అలవర్చుకునేందుకు కేజీబీవీకి 14 కంప్యూటర్లు అందించడం జరిగిందన్నారు. తమ కంపెనీ సామాజిక దృక్పథంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో జీసీడీఓ సుప్రియ, సదాశివపేట ఎంఈఓ అంజయ్య, కేజీబీవీ ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ, పెప్సీకో ప్రతినిధులు అమర్జిత్ సింగ్, రజనిసోలొమెన్, నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు మయూర్ పట్నాల, అబ్దుల్ వహీద్, హిమబిందు పాఠశాల ఉపాద్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.