రామచంద్రాపురం, నవంబర్28 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కమ్యూనిటీ క్రీడా పోటీలను ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రారంభించారు. తెల్లాపూర్, నలగండ్ల పరిధిలోని 50కిపైగా గేటెడ్ కమ్యూనిటీస్కి చెందిన 650 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యార్రమ్స్, వాలీబాల్, షెటిల్, క్రికేట్ పోటీలను నిర్వహించారు. అదేవిధంగా సాన్సియా విల్లాస్లో నూతనంగా ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటితరం విద్యార్థులు, యువతరం టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న ఈ తరుణంలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
క్రీడలతో శారీరకధృడత్వం, మానసిక ఉల్లాసం పెంపొందడంతో మనం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. ప్రపంచంతో పోటీపడుతూనే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. అంతకుముందు గేటెడ్ కమ్యూనిటీలోని స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
కార్యక్రమంలో ఏఎంసీ వైస్చైర్మన్ మల్లారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి, నాయకులు ఉమేశ్వర్, ఇందిరారెడ్డి, రవీందర్రెడ్డి, నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ తదితరులు ఉన్నారు.