సంగారెడ్డి : అనధికారికంగా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆరు ఆస్పత్రులను అధికారులు సీల్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు ఆదేశానుసారం జిల్లా పరిపాలన, పోలీసు శాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు జహీరాబాద్ డివిజన్ పరిధిలోని క్లినిక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అవసరమైన అనుమతులు పొందకుండా కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆరు క్లినిక్లను గుర్తించారు.
మోడ్రన్ క్లినిక్, న్యూ నోవా క్లినిక్, అఖిల్ నిఖిల్ క్లినిక్, దిగ్వాల్ విలేజ్ క్లినిక్, కృష్ణ డయాగ్నొస్టిక్ సెంటర్, సిటిజెన్ పాలీ క్లినిక్ ఈ ఆరు క్లినిక్లు ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు పొందకుండా కొవిడ్ -19 ఆరోగ్య సేవలను అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.