జహీరాబాద్ : అక్రమంగా రెండు లారీల్లో తరలిస్తున్న 437 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీవో చెక్పోస్టు వద్ద పట్టుకున్నట్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శఫియొద్దీన్ తెలిపారు. గురువారం సాయంత్రం వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు జహీరాబాద్ మండలంలోని చిరాగ్పల్లి శివారులో మాడ్గి రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి గుజరాత్కు వెళ్తున్న ఎంఎస్ 43 వై 6300 నంబర్ గల లారీలో 187.40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, కేఏ 56 2172 నంబర్ గల లారీలో 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని లారీలను సీజ్ చేశామన్నారు. రేషన్ బియ్యాన్ని జహీరాబాద్లో ఉన్న ఏఎంసీ గోదాములకు తరలించి, లారీ డ్రైవర్లు అలవోద్దీన్(హుమ్నాబాద్- కర్ణాటక), సయ్యద్ సిలార్ (బస్వకల్యాణ్- కర్ణాటక)ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసును చిరాగ్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.