సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 28 : ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని శాఖల సమన్వయంతో సదుపాయాలు సమకూర్చామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఇందిరానగర్, రాఘవేంద్రనగర్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం సీపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్లు ధరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్, మాస్క్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి 465 మంది పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భయబ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఎన్నికల నియమావళి ఎవరైన ఉల్లంఘిస్తే పోలీసు కమిషనరేట్ వాట్సాప్ నంబరు 7901100100 లేదా గజ్వేల్ ఏసీపీ 8333998684 నంబరుకు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. పోలీసు కమిషనర్ వెంట ఏసీపీ రామేశ్వర్, పోలీసు అధికారులు ఉన్నారు.
సిద్దిపేటలో మద్యం పట్టివేత
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 28 : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకొచ్చిన మద్యాన్ని సిద్దిపేట టూటౌన్ పోలీసులు బుధవారం సీజ్ చేశారు. సీఐ పరశురామ్గౌడ్ వివరాల ప్రకారం పట్టణంలోని ఆదర్శనగర్ రోడ్డులో గల ఓ భవనంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారని సమాచారంతో ప్రత్యేక టీమ్తో కలిసి రైడ్ చేశామన్నారు. తనిఖీల్లో 311 రాయల్ స్టాగ్, 12 బ్లెండర్ ప్రైడ్ ఫుల్ బాటిళ్లు మొత్తం రూ.లక్షా 38 వేల విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇమ్రాన్ అనే వ్యక్తి పోలీసులను చూసి మోటారు సైకిల్ వదిలేసి పారిపోయాడన్నారు. మద్యం రవాణా చేసిన టాటాఏసీ వాహనాన్ని, యజమాని మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకొని, పంచనామా చేశామన్నారు.