తెలంగాణ ప్రభుత్వం గొల్లకుర్మల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. అర్హులకు గొర్రెలను పంపిణీ చేసి ఉచిత దాణాను అందజేస్తున్నది. మంద అనారోగ్యానికి గురైనప్పుడు ‘1962’ పశువైద్య వాహనాలను ఏర్పాటు చేసి సేవలు అందజేస్తున్నది. కాగా, గొల్లకుర్మలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సంఘాల్లో సభ్యుల పదవీ కాలం ముగియడంతో ప్రాథమిక, జిల్లాస్థాయి గొర్రెకాపర్ల సంఘం చైర్మన్, డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే నెలలో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఓటర్ల జాబితాను గుర్తించే పనిలో పడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1185 ప్రాథమిక సంఘాలు ఉండగా, సంగారెడ్డి జిల్లాలోని 522 సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
సంగారెడ్డి, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : గొర్లకాపర్ల సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2020లో గొర్లకాపర్ల సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. కొవిడ్ కారణంగా ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేసింది. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా గొర్లకాపర్ల సంఘం ఇన్చార్జిగా పోచబోయిన శ్రీహరియాదవ్ కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లా గొర్లకాపర్ల సంఘాన్ని విభజించి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్కు జిల్లా స్థాయి సంఘాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రాథమిక గొర్లకాపర్ల సంఘం ఎన్నికలు, జిల్లా స్థాయి గొర్లకాపర్ల సంఘం డైరెక్టర్, చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1185 ప్రాథమిక గొర్లకాపర్ల సంఘాలు ఉన్నాయి. కాగా వీటిని విభజించారు. సంగారెడ్డి జిల్లాలో 522 ప్రాథమిక గొర్లకాపర్ల సంఘాలు ఉండగా.. సిద్దిపేటకు 338 సంఘాలు, మెదక్కు 325 సంఘాలను కేటాయించటం జరిగింది. ఆయా ప్రాథమిక సంఘాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు వీలుగా ప్రస్తుతం ఓటర్ల జాబితా తయారీలో పశుసంవర్ధకశాఖ అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక గొర్లకాపర్ల సంఘాల పదవీకాలం ముగియడంతో కొత్త పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంది. దీని కోసం గొర్లకాపర్లు కొత్తగా సభ్యత్వం నమోదు చేసుకోవటంతోపాటు ఫొటో ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక గొర్లకాపర్ల సంఘంలో 50 మందిలోపు ఓటర్లు ఉంటే ఓటరు జాబితాతోపాటు రూ.500 డీడీ, 500 మందిపైన ఉంటే రూ.2 వేల డీడీని పశుసంవర్ధకశాఖ అధికారులకు అందజేయాలి. పశుసంవర్ధకశాఖ అధికారులు కొత్త ఓటరు జాబితాను ఉన్నతాధికారులు, సహకార శాఖ అధికారులకు అందజేసి ఆమోదం తీసుకుంటారు. ఫొటో ఓటరు జాబితా ఆమోదం లభించిన వెంటనే ప్రాథమిక గొర్లకాపర్ల సంఘాలకు ఎన్నికలు జరుపుతారు. ప్రాథమిక గొర్లకాపర్ల సంఘం సభ్యులు చైర్మన్తోపాటు 10 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు కలిసి జిల్లా గొర్లకాపర్ల సంఘం డైరెక్టర్లు, చైర్మన్లను ఎన్నుకుంటారు. మే మొదటి వారంలో జిల్లా గొర్లకాపర్ల సంఘం డైరెక్టర్లు, చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్లకాపర్ల అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. గొర్రెలను పంపిణీ చేయటంతోపాటు సంఘాలకు భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నది. దీంతో గొర్లకాపర్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంతో సానుకూలంగా ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో అత్యధిక సంఘాలు..
సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా గొర్లకాపర్ల ప్రాథమిక సంఘాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 1185 సంఘాలు ఉండగా, సంగారెడ్డిలో అత్యధికంగా 522 సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల పరిధిలో 22,401 మంది సభ్యులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక గొర్లకాపర్ల సంఘాలకు 2015లో ఎన్నికలు జరిగాయి. 2020తో సంఘం సభ్యులు, చైర్మన్ల పదవీకాలం ముగిసింది. తాజాగా వచ్చే నెలలో 522 ప్రాథమిక సంఘాలు, జిల్లా సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. మొదట 522 ప్రాథమిక గొర్లకాపర్ల సంఘాలకు ప్రాథమిక గొర్లకాపర్ల సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఫొటో ఓటరు జాబితాను తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 120 సంఘాలకు సంబంధించి ఫొటో ఓటరు జాబితా తయారైంది. మిగితా సంఘాల ఓటరు జాబితాను పశుసంవర్ధకశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం
జిల్లా, ప్రాథమిక గొర్లకాపర్ల సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాగం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మొదట సంగారెడ్డి జిల్లాలోని 522 ప్రాథమిక సంఘాలకు ఎన్నికలు జరుపుతాం. ఇందుకోసం ఫొటో ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నాం. గ్రామాల్లోని ప్రాథమిక గొర్లకాపర్ల సంఘం లో సభ్యులుగా ఉన్నవారు తమ పేర్లను ఫొటో ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలి. ఏమైనా అనుమానాలు ఉంటే స్థానిక పశుసంవర్ధకశాఖ అధికారులను సంప్రదించాలి. ప్రాథమిక సంఘాల ఎన్నికలు పూర్తయిన తర్వాత జిల్లా సంఘం ఎన్నికలు, డైరెక్టర్లు, చైర్మన్లను ఎన్నుకుంటాం.
వసంతకుమారి, జేడీ పశుసంవర్ధకశాఖ