సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డికి వైద్య కళాశాలను మంజూరు చేయడంతో పాటు ఈ ఏడాది నుంచే తరగతులు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తాత్కాలికంగా వైద్య కళాశాల నిర్వహణ కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో కార్యాలయాన్ని వేగంగా షిఫ్టు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలోని మెడికల్ స్టాఫ్ క్వార్టర్స్లోకి డీఎంఅండ్హెచ్వో కార్యాలయాన్ని షిఫ్టు చేయనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన మరమ్మతుల పురోగతిని కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది క్వార్టర్స్ మరమ్మతులను వేగంగా పూర్తి చేసి డీఎంఅండ్ హెచ్వో కార్యాలయాన్ని షిఫ్టు చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత మూడు భవనాల మరమ్మతులను వారం రోజుల్లో పూర్తి చేసి అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ను మరో చోటుకు తరలించేందుకు సరిపడే భవనాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆరా తీశారు.
ఆక్సిజన్ ప్లాంట్ తనిఖీ
అనంతరం వెల్నెస్ సెంటర్ దగ్గరలో ఏర్పాటు చేసిన నూతన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ను కలెక్టర్ తనిఖీ చేశారు. కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి కలెక్టర్కు వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయినందున త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా దృష్టి సారించాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజర్షీ షా, ఆర్ ఆండ్ బీ, పంచాయతీ రాజ్ ఈఈలు, డీఈలు తదితరులు ఉన్నారు.