సంగారెడ్డి, జూన్ 15 : వానకాలం ప్రారంభమైనందున ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మున్సిసల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య, అటవీశాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, ముప్సిపాలిటీల్లో పారిశధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. కౌన్సిల్ సభ్యులు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ఎక్కువగా వచ్చిన హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరీక్షలు, మందులు అందుబాటులో సిద్ధ్దంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి శుక్రవారం డ్రై డే గా, ఆదివారం పది గంటలకు పదినిమిషాల కార్యక్రమాలను కొనసాగించాలని కమిషనర్లకు సూచించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు వారంలో ఒకరోజు పల్లెనిద్ర చేయాలన్నారు. అనుమతులు లేని లే అవుట్లు, నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు.
ముఖ్యంగా నాలాపై ఉన్నా నిర్మాణాలు, డబ్బాలను తొలగించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో కార్డు కమిటీ సమావేశాలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. త్వరలో ఏడో విడత హరితహారం ప్రారంభమయ్యే అవకాశం ఉంందని తెలిపారు. సమావేశంలో డీఎంఅండ్హెచ్వో గాయత్రీదేవి, డీఆర్డీవో శ్రీనివాస్రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో సురేశ్ మోహన్, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మలేరియా ప్రోగ్రామ్ అధికారి సుధాకర్, మండల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీవోలు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల సందేహాల కోసం కంట్రోల్ సెల్
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూన్ 15 : సీజనల్ వ్యాధులకు సంబంధించిన సందేహాలు, వైద్య సలహాల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఎపిడమిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 8309472053 నెంబర్కు ఫోన్ చేసి సీజనల్ వ్యాధులకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవడంతో పాటు వైద్య సలహాలు పొందవచ్చని ఆయన సూచించారు. అలాగే రాష్ట్ర ఎపిడమిక్ కంట్రోల్ నెంబర్ 040-24651119 కు కూడా ఫోన్ చేసి వైద్య సలహాలు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ సెల్ 24 గంటలు పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.