నారాయణఖేడ్, జూన్ 7 : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. భర్తలను కోల్పోయి కుటుంబ పోషణ కోసం ఒకరు మున్సిపల్ కార్మికురాలిగా, మరొకరు పాచి పనులు చేస్తూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఈ ఇద్దరు మహిళలు ఒకేసారి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒడి చేరారు. విధి నిర్వహణలో భాగంగా మున్సిపల్ కార్మికురాలు రోడ్డును శుభ్రం చేస్తుండగా.. మరోవైపు పాచి పనులు చేసేందుకు తన ఇంటి నుంచి బయల్దేరి వెళ్తున్న మరో మహిళను బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. పోసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో మన్సూర్పూర్కు చెందిన సత్యమ్మ(45) రోడ్డు శుభ్రం చేస్తుండగా అటువైపుగా వస్తున్న నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూనగర్కు చెందిన విఠమ్మ(46)ను బొలెరో ట్య్రాలీ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొనడంతోపాటు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం సీఐ రవీందర్రెడ్డి, ఎస్సై వెంకట్రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డ్రైవర్ మద్యం తాగి వాహనాన్ని అతివేగంగా నడిపి మహిళల మృతికి కారణమయ్యాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమో దు చేసి మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణం లో ఈ తరహా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నెహ్రూనగర్, మన్సూర్పూర్ల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కన్నీరు మున్నీరైన మృతుల కుటుంబీకులు..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. విఠమ్మ భర్త నర్సింహులు నెల రోజుల క్రితం మృతి చెందగా, మున్సిపల్ కార్మికురాలు సత్యమ్మ భర్త ఆరు నెలల క్రితం మృతి చెందాడు. విఠమ్మకు ముగ్గురు కొడుకులు ఉండగా.. సత్యమ్మకు ఒక కొడుకు ఉన్నాడు.