సంగారెడ్డి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : 2018 నుంచి సంగారెడ్డి జిల్లాలోని రైతులకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద రూ.2143 కోట్లు అందజేసింది. సంగారెడ్డి జిల్లాలో 3.13 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 1,64,187 మంది సన్నకారు రైతులు ఉండగా, 95,592 మంది చిన్నకారు రైతులు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాలం కలిసివస్తే రైతులు 5 నుంచి 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసేవారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు పంటసాగు చేయాలంటే బ్యాంకు రుణాలు,ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఎక్కువగా ఆధారపడేవారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు రైతులకు రూ.1500 నుంచి రూ.2000 కోట్ల వరకు రుణాలు అందజేసేవారు. బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు రైతులు తప్పనిసరిగా తమ భూ యాజమాన్యపత్రాలను బ్యాంకర్ల వద్ద తనఖా పెట్టాల్సి వచ్చేది. సకాలంలో పంటరుణాలు చెల్లించకపోతే తీసుకున్న రుణాలపై వడ్డీ పెరిగి రైతులకు అప్పుల భారం పెరిగేది. రైతులు సకాలంలో పంట రుణాలు చెల్లించరన్న సాకుతో బ్యాంకర్లు రైతులకు పంటరుణాలు మంజూరు చేసేవారు కాదు.
ఎక్కువగా ఇది వరకు తీసుకున్న రైతులు పంటరుణాలు రెన్యువల్ చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నాలుగేళ్లుగా లీడ్బ్యాంకు ద్వారా లక్ష్యం మేరకు వందశాతం రైతులకు పంటరుణాలు పంపిణీ చేయలేదు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2479 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.2091 కోట్ల రుణాలు అందజేశారు. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇలా సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ ప్రాంతాల్లోని రైతులు తమ గ్రామంలోని లేదా పట్టణంలోని షావుకార్లు, వడ్డీవ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునేవారు. ఎకరాకు రూ.10 నుంచి 15వేల వరకు రూ.2 నుంచి రూ.2 వరకు వడ్డీకి రుణాలు తీసుకునేవారు. వడ్డీకి తీసుకున్న డబ్బులతో పంటలు సాగు చేసేవారు. కాలం కలిసిరాక పంటలు పండకపోతే తీసుకున్న అప్పులు చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు జిల్లాలో ఉన్నాయి. చేతిలో డబ్బులు లేకపోవటంతో రైతులు క్రమంగా వ్యవసాయం చేయడం తగ్గించారు. మరీ ముఖ్యంగా సన్నచిన్నకారు రైతులు పంటసాగుకు పెట్టుబడి లేక భూముల బీడువేసేవారు.
తగ్గిన అప్పులు… పెరిగిన సాగు విస్తీర్ణం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రైతుల పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి రైతుబంధు పథకం రైతుల పాలిట వరంలా మారింది. 2018 నుంచి రైతుబంధు పథకం ద్వారా జిల్లాలోని రైతులకు రూ.2143 కోట్ల పెట్టుబడి సాయం అందింది. పెట్టుబడి సాయం డబ్బులు రావటంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంట సాగు చేస్తున్నారు. ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. పంటపెట్టుబడి సాయంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో పెట్టుబడి లేక పంటసాగు చేయని రైతులు, ప్రస్తుతం పెట్టుబడి సాయం అందుతుండటంతో భూములను సాగు చేస్తున్నారు. పెట్టుబడి సాయానికి ముందు జిల్లాలో 6 లక్షల ఎకరాలు సాగయ్యేది. ప్రస్తుతం 7.35 లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. రైతుబంధు పథకం అమలు ఫలితంగా జిల్లాలో 1.35 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది.
రైతుబంధు వరంగా మారింది..
రైతుబంధు పథకం రైతులకు వరంగా మారింది. గతంలో పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడి కోసం రైతులు బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేశారు. రైతుబంధు పథకం అమలు తర్వాత రైతులు పెట్టుబడి సాయంకోసం ఎదురుచూసే పరిస్థితి తప్పింది. వానకాలం, యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. దీంతో రైతులు సీజన్ ప్రారంభం కాగానే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తున్నారు. గతంతో పోలిస్తే బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు రుణాలు తీసుకోవడం తగ్గింది. పెట్టుబడి సాయంతో జిల్లాలో బీడు భూముల్లో సైతం రైతులు పంటలు సాగు చేయడం ప్రారంభించారు. జిల్లాలో ఏటా పంటసాగు విస్తీర్ణం పెరగడానికి వర్షాలతో పాటు రైతుబంధు పథకం ప్రధాన కారణం.
-నర్సింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి, సంగారెడ్డి
రైతుబంధుతో మక్కపంట వేశా..
నాకు రైతుబంధు సాయంగా రూ.12వేలను ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో జమచేసింది. దీంతో నాకు ఉన్న రెండున్నర ఎకరాల్లో మక్కపంట వేశా. పెట్టుబడి సాయం తో పడావ్గా ఉన్నభూమిలో పంటవేయ డం ఎంతో సంతోషానిచ్చింది. రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-రాజేందర్, సర్ధార్తండా, కంగ్టి
పెట్టుబడి సాయం మరువలేనిది..
గతంలో పంట పెట్టుబడికి బంగారం, వెండి ఉంటే కుదువ పెట్టేవాళ్లం.. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మా లాంటోళ్ల బాధను పసిగట్టి ఏటా రెండు పంటలకు సాయంగా ముందే పెట్టుబడి పైసలను వేస్తుండటంతో పాటు ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి, పంటను కొనుగోలు చేస్తుండటంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నది. రైతులకు కేసీఆర్ సార్ ఇచ్చే పెట్టుబడి సాయం మరువలేనిది.
రైతు బంధుతో సాగుకు భరోసా..
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఎకరాకు రూ.5 వేలు చొప్పున ప్రతి ఏడాది రెండు విడతలుగా రైతుల ఖాతాలో జమ చేయడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులందరం రుణపడి ఉంటాం.
-పూజారి రవి, వీరోజిపల్లి, పెద్దశంకరంపేట మండలం