సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 5 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్యాధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, రెవెన్యూ అధికారులు, సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలతో అదనపు కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వెంటనే కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఓపీలో డాక్టర్లు పరీక్షించి ఏమైనా కొవిడ్ లక్షణాలు ఉంటే మెడికల్ కిట్లను ఇవ్వాలన్నారు. కిట్లోని మందులు 4 లేదా 5 రోజులు తీసుకున్నప్పటికీ లక్షణా లు ఉంటే స్టెరాయిడ్స్ ప్రారంభించాలని చెప్పారు. మెడికల్ కిట్లు పంపిణీ చేసినప్పుడు అందులో ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వాలని, స్టెరాయిడ్స్ కూడా కిట్లో ఉంచాలన్నారు. అవసరమైన కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చూసుకోవాలన్నారు. సర్పంచ్ లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, అగన్వాడీ టీచర్లు, ఆర్ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి కొవిడ్ ఓపీ సేవలకు పంపాలని సూచించారు.
ఇంటింటి సర్వే నిర్వహించాలి…
ఇంటింటికీ సర్వే నిర్వహించి కొవిడ్ లక్షణాలున్నవారిని గుర్తించి అక్కడికక్కడే మెడికల్ కిట్లు ఇవ్వాలన్నారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురితో కూడిన ఒక టీంను ఏర్పాటు చేయాలని, వారితో ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్, అంగన్వాడీ టీచర్లతో టీంలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచా యతీలో కూ డా అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచా లన్నారు. మండల డివిజన్ మున్సిపల్ స్థాయిలో ఆ యా అధికారులు మానీటరింగ్ చేయాలని తెలిపారు. కొవిడ్కు సంబంధించిన బ్యానర్లను కొవిడ్ ఓపీ దగ్గర, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లోని అన్ని ప్రవేట్ దవాఖానల్లో ఏర్పాటు చేయాలన్నారు.
స్లాట్ బుకింగ్ ద్వారానే వ్యాక్సిన్ ఇవ్వాలి..
45 ఏండ్లు దాటిన వారికి కూడా స్లాట్ బుకింగ్ ద్వారానే వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో వ్యాక్సినేషన్ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఆక్సిజన్ దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. కొవిడ్ సేవలు అందిస్తున్న అన్ని ప్రైవేట్ దవాఖానల్లో వైద్య చికిత్స రేట్లను ప్రదర్శించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే చికిత్సలు చేయాలన్నారు. దవాఖానల్లో పేషెంట్లకు సరిపడా బెడ్లు ఉండాలని, పేషెంట్స్ డిశ్చార్జి విషయాల్లో జాప్యం చేయకూడదన్నారు. నోడల్ అధికారులు ప్రతిరోజూ ప్రైవేట్ దవాఖానలను సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు.
చెత్తాచెదారాన్ని తొలిగించాలి..
జిల్లా దవాఖాన, ఏరియా దవాఖానల్లో లోపల, బయట చెత్తాచెదారాన్ని ఒక డ్రైవ్గా చేపట్టి తొలిగించాలని అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అవసరమైన చోట లైటింగ్ ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా వైట్ వాష్ అవసరం ఉంటే వేయించాలన్నారు. క్వారంటైన్లో ఉండడానికి వీలులేని కొవిడ్ బాధితుల కోసం ఐసొలేషన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు అవసరమైన భవనాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కుటుంబంలోని అందరూ పాజిటివ్తో ఉన్నట్లయితే వారికి భోజనం ఏర్పాట్లు చేయడంలో సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు చొరవ తీసుకోవాలని తెలిపారు. మాస్క్ ధరించని వారిని గుర్తించి జరిమానాలు విధించాలని, దవాఖానల్లో అవసరమైన వారే చేరేలా అవగాహన కల్పిం చాలన్నారు. కాన్ఫరెన్స్లో డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి, జడ్పీ సీఈవో, డీఆర్డీవో, డీపీవో, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.