పటాన్చెరు, ఏప్రిల్ 16 : ధీర వనిత అంటే ఇలా ఉండాలని విజయను అందరూ ప్రశంసించారు. ఔను మరి… పాము..పాము అనగానే దూరంగా పారిపోయి టెన్షన్ పడటం సర్వత్రా కనిపిస్తుంది. దీనికి భిన్నంగా పాము ఉందని సమాచారం అందుకోగానే హుటాహుటినా వచ్చిన మహిళ పామున్న చోటికి వెళ్లి చేతితో పామును పట్టుకోవడం చూసిన వారంతా బిత్తర పోయారు. పట్టుకున్న పాముకు దాహం వేస్తున్నదని గ్రహించి బాటిల్తో నీటిని తాపి పద్ధ్దతిగా సంచిలో వేసుకుని ప్యాక్ చేసుకుని వెళ్లింది. ఇదంతా చూసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆ స్నేక్ సొసైటీ సభ్యురాలు విజయను ప్రశంసించారు. శుక్రవారం మధ్యాహ్నం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాము కనిపించింది. కార్యాలయ సిబ్బంది తక్షణం బోరంపేట్లోని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి ఫోన్లో సమాచారం ఇచ్చారు. సొసైటీ సభ్యురాలు విజయ కొద్ది సేపట్లోనే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని పామును పరిశీలించారు. క్షణాల వ్యవధిలో పామును చేతితో పట్టుకుని బయటకు తీసుకుని వచ్చారు. రోడ్డుపై పామును శాంతింపజేసి బాటిల్తో నీటిని తాపారు. ఈ దృశ్యం చూసినవారంతా ఆశ్చర్య చకితులయ్యారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ పాములు మనుషులున్న చోటకు రావడానికి ఇష్టపడవన్నారు. ఆహారం కోసం వస్తాయన్నారు. పాములు పర్యావరణానికి మేలు చేస్తాయని వాటిని చంపవద్దని కోరారు. పాములు కనిపిస్తే తమ సొసైటీకి హెల్ప్ లైన్ నెంబర్ 83742 33366కి సమాచారం ఇవ్వాలని కోరారు.