సంగారెడ్డి, జూన్ 12 : ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుతో పోలీసులు ప్రజలకు చేరువయ్యారని, దీంతో సత్ఫలితాలను వస్తున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, పోలీస్శాఖ ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టిసారించిందని, అత్యాధునికంగా ఠాణాలు, పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ నిర్మిస్తున్నదని, పోలీసులు చేస్తున్న సేవలు భేష్ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం సంగారెడ్డిలో పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. పోలీస్ హౌసింగ్ సొసైటీ నిధులు కోటి రూపాయలతో అత్యాధునికంగా ఈ పోలీస్స్టేషన్ నిర్మించారు. ఈ సందర్భంగా కొత్త భవనంలో గదులను పరిశీలించి, జనరల్ డైరీలో హోంమంత్రి వివరాలు నమోదు చేశారు. తర్వాత స్థానిక పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 70శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తయిందని, నేరాలు చేసేందుకు నిందితులు బయపడుతున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పోలీసుల సేవలు విస్తరించాయని, శాంతిభద్రతలు పక్కాగా అమలవుతున్నట్లు తెలిపారు. మహిళల సంరక్షణకు షీటీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు పోలీసులు తమవంతు సేవలు అందిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. పోలీస్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన అమలు చేసి వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. నూతన భవనాల నిర్మాణంతో అధునాతన గదులు అందుబాటులోకి వచ్చాయని, విశ్రాంతితో పాటు పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి సౌకర్యంగా మారిందన్నారు. శాంతిభద్రతలు బాగుండడంతోనే రాష్ర్టానికి పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నట్లు తెలిపారు. ‘డయల్ 100’కు కాల్చేసిన నిమిషాల వ్యవధిలోనే సంఘటనా ప్రదేశాలకు పోలీసులు చేరుకుంటున్నారని తెలిపారు.
పోలీసులంటే భయం పోయింది..