జహీరాబాద్, జూన్ 8 : రైతులు వర్షాధార పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేందుకు భూములు సిద్ధం చేసుకొని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. తొలకరి వర్షలు కురవగానే విత్తనాలు వేసేందుకు అన్నదాతలు వ్యవసాయ భూముల్లో జోరుగా పనులు చేస్తున్నారు. చిరుధాన్యాల సాగుతోపాటు వాణిజ్య పంటల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో జహీరాబాద్ డివిజన్లో రైతులు చెరుకు, అల్లం, పసుపు, బొప్పాయి, పంటలు సాగు చేసే వారు. మార్కెట్లో డిమాండ్తో పాటు కూలీల సమస్య అధికంగా ఉండడంతో రైతుల ఆలోచన మారిపోయింది. ఏడాదిలో రెండు పంటలు తీయడంతో పాటు మార్కెట్లో మంచి ధర ఉన్న పంటలు సాగు చేసేందుకు ఆసక్తగా ఉన్నారు. గతంలో పత్తి సాగు చేయలంటే ఆంధ్ర ప్రాంతం వారు భూములు లీజ్కు తీసుకొని సాగు చేస్తే వారు చూపిన విత్తనాలు, రసాయన,మందులు వేసి ఇక్కడ రైతులు పంటలు సాగు చేసే వారు. గత ఐదు, ఆరు సంవత్సరాలుగా పరిస్థితి మరిపోయింది. ఇక్కడ రైతులు అధికంగా పత్తి పంటను సాగు చేసి లాభాలు పొందుతున్నారు. పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మిల్లులు ఏర్పాటు చేసి మద్దతు ధర కలిపిస్తున్నది. పత్తి కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేసిన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జామ చేస్తున్నది. దీంతోఈ ఏడాది రైతులు పత్తి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.
గత ఏడాది జహీరాబాద్ డివిజన్లో వాన కాలంలో 1,76,290 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సీజన్లో రైతులు 1, 77,500 ఎకరాల్లో వర్షాధార పంటలు సాగు చేస్తారనే అంచనా వ్యవసాయ శాఖ అధికారులు వేస్తున్నారు. గత ఏడాది కంటే అధికంగా పంటలు సాగు చేస్తారని, దీంతో మార్కెట్లో విత్తనాలు, ఎరువుల అమ్మకాలు అధికంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గత ఏడాది పత్తి 57,838 ఎకరాల్లో సాగు చేయగా, ఈ సీజన్లో రైతులు 69 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని ఆంచన వేస్తున్నారు. సోయాబిన్ 34,083 ఎకరాల్లో సాగు చేయగా, ఈఏడాది 30 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు. గత ఏడాది కందుల సాగు 24,254 ఎకరాల్లో ఉండగా, ఈ ఏడాది 35 వేల ఎకరాల్లో సాగు చేయడంతో కంది సాగు పెరుగుతున్నది. జొన్న పంట గత ఏడాది 1550 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 4వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. మినుము సాగు పెరిగినా , పెసరా పంట సాగు రైతులు తగ్గించే అవకాశం ఉందని వారు తెలిపారు.
వర్షాధార పంటల వైపు చూపు
జహీరాబాద్ డివిజన్లో నీటివనరులు లేవు. రైతులు వరి సాగు చేయరు. చెరుకు, అల్లం, బొప్పా యి, పసుపు, కూరగాయలు వ్యవసాయ బోరు బావుల వద్ద సాగు చేస్తారు. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంతో వ్యవసాయ బావుల వద్ద వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలంలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా వాన కాలంలో సోయా, పత్తి, తెల్లజొన్న, పచ్చజొన్న, కంది, మినుము, పెసరాతో పాటు చిరుధాన్యాల పంటలైన సజ్జలు, రాగులు, కొర్రలతో పాటు పలు పంటలు సాగు చేస్తారు. మార్కెట్లో అధికంగా పత్తి పంటకు డిమాండ్ ఉంది. డిమాండ్తో పాటు వర్షాధారంగా పంట సాగు చేసే అవకాశం ఉంది. పంట దిగుబడి సైతం అధికంగా ఉండడంతో రైతులు సాగు వైపు మళ్లుతున్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో పాటు ఇంట్లో ఆహారంగా తీసుకోనేందుకు సన్న, చిన్నకారు రైతులు పంటలు సాగు చేసుకోనేందుకు ఆసక్తిగా ఉన్నారు.
పత్తితో రైతుకు ఆదాయమూ ఎక్కువ…
పత్తి పంటను రైతులు తెల్ల బంగారంగా పిలుస్తారు. పత్తికి మిగతా పంటలతో పోల్చితే సాగు ఖర్చు సైతం ఎక్కువగా ఉంటుంది. పత్తి సాగు చేసే రైతులు ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు చేస్తారు. పత్తి పంట దిగుబడి నల్లరేగడి భూముల్లో, నీళ్లు పెడితే ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. వర్షాధారంగా సాగు చేసే రైతులు ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. చెలక భూముల్లో నీళ్ల వసతి ఉంటే ఎకరాకు 6 నుంచి 7, వర్షాధారంగా 5నుంచి 6 క్వింటాళ్లు వస్తుంది. మార్కెట్లో ప్రస్తు తం మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,500 నుంచి 5,500 వరకు ఉంది. జహీరాబాద్ డివిజన్లో నల్లరేగడి భూములు నాణ్యమైనవిగా ఉండడంతో పత్తి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు, చీడపీడల బెడదతో పత్తి దిగుబడి గత ఏడాది ఎకరాకు 10 క్వింటాళ్లు దాటలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ప్రభుత్వనికి నివేదిక ఇ చ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు చూపిన లెక్కల ప్రకారం ఎకరాకు రైతుకు రూ. 40 వేల ఆదాయం వస్తోం ది. పత్తి పంట సాగు చేసేందుకు రైతులు రూ. 25 వేల వరకు ఖర్చు చేస్తారు. ఖర్చులు పోను రూ. 15 వేల వరకు రైతుకు మిగులుతున్నట్లు వ్యవసాయ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. విదేశాల్లో తెలంగాణ పత్తికి డిమాండ్ ఉండడంతో ధర పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో సైతం పత్తికి అధిక ధర ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రైతులు తెల్ల బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
పత్తి సాగు పెరిగే అవకాశం ఉంది
పత్తికి మార్కెట్లో మంచి ధర ఉండడంతో పాటు దిగుబడి అధికంగా వస్తుండడంతో రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది కంటే ఈ సీజన్లో పత్తి సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ చేసిన సర్వేలో తేలింది. రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసి వ్యాపారి నుంచి తప్పకుండా రసీదు తీసుకోవాలి. పంట నష్టం జరిగితే విత్తన కంపెనీ నుంచి పరిహారం పొందే అవకాశం ఉంది. జహీరాబాద్ ప్రాంతంలో రైతులు పత్తిని వర్షాధారంగా, వ్యవసాయ బావుల వద్ద నీటి సరఫరా చేసి సాగు చేస్తారు. గత ఏడాది ప్రభుత్వం పత్తి మిల్లుల వద్ద కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించడంతో రైతులకు మేలు జరిగింది. ఈ ఏడాది న్యాల్కల్, ఝరాసంగం మండలంలో పత్తి అధికంగా సాగు చేసే అవకాశం ఉంది.