సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగ యువతకు ఉపాధిచూపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలో సైతం త్వరలో ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్(ఫుడ్ పార్క్) ఏర్పాటు చేయనున్నది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా సాగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుపై కలెక్టర్ హనుమంతరావు ఇతర అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఫుడ్ ప్రాపెసింగ్ జోన్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
దీంతో జిల్లా యంత్రాంగం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇటీవల అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో ప్రభుత్వభూములను పరిశీలించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూములు లింగంపల్లిలో ఉన్నాయని, ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో సైతం ఫుడ్ పార్కు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. దీంతో వెంకటాపూర్ గ్రామంలో సైతం ఫుడ్ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు మునిపల్లి మండలం లింగంపల్లి, కోహీర్ మం డలం వెంకటాపూర్ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. రెండు గ్రామాల్లో సర్వే సిబ్బంది డిజిటల్ సర్వే చేసి, ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉన్నదని పరిశీలించారు. అధికారుల సమాచారం మేరకు రెండు గ్రామాల్లో 914 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో 486 ఎకరాల అందుబాటులో ఉంది. లింగంపల్లిలోని సర్వే నెం.108లో 293 ఎకరాలు, సర్వే నెం. 219లో 135 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కోహీర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో 428 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వెంకటాపూర్లోని సర్వే నెం.58లో 486 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లింగంపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వభూముల వివరాలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి రెండుమూడు రోజుల్లో అందజేయనున్నది. దీంతో ఫుడ్ పార్కు ఏర్పాటుపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ప్రభు త్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రభుత్వభూమిని టీఎస్ఐఐసీ స్వాధీనం చేసుకుని అక్కడ ఫుడ్ పార్కు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
ఫుడ్ పార్కుతో యువతకు ఉపాధి
ప్రభుత్వం తెలంగాణలో ఏ పంట ఎక్కడ పండితే అక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు తెలంగాణలో 21 క్లస్టర్లను ఏర్పాటు చేసింది. జిల్లాల్లో స్థానిక వ్యవసాయ ఉత్పత్తులు, డెయిరీ, మాంసం ఉత్పత్తుల ఆధారంగా పల్లెల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్ పార్కుల ఏర్పాటుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లాభం చేకూరడంతోపాటు స్థానిక గ్రామీణ యువతకు ఉపాధి లభించనున్నది. సంగారెడ్డి జిల్లాలో త్వరలోనే ప్రభుత్వం ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనున్నది. సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ, పండ్ల ఉత్పత్తులు ఎక్కువ. వీటితోపాటు పాల, మాంసం ఉత్పత్తులు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న ఫుడ్ పార్కులో ఆగ్రో, ఫ్రూట్, మీట్, డెయిరీలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు అవకాశాలెక్కువగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో రైతులు టమాట, ఆలుగడ్డ, పసుపు, అల్లం పంటలను ఎక్కువగా పండిస్తారు. టమాటను ప్రాసెసింగ్ చేసి పచ్చళ్లు, టమాటో సాస్, కేచప్ తయారు చేయవచ్చు. జహీరాబాద్ ప్రాంతంలో రైతులు ఆలుగడ్డ ఎక్కువగా పండిస్తారు. ఆలుగడ్డ ప్రాసెస్ చేసి చిప్స్ ఇతర ఉత్పత్తులు తయారీకి అవకాశం ఉంది. అలాగే జిల్లాలో అల్లం పంట ఎక్కువగా సాగు చేస్తారు. దీంతో అల్లం పచ్చళ్లు, అల్లం మురబ్బా తయారు చేయవచ్చు. జిల్లా రైతులు పసుపు, మిరపను సాగు చేస్తున్నారు. వీటిని ప్రాసెస్ చేసి మసాలాలు తయారు చేసేందుకు వీలుంది.
కొత్తగా ఏర్పాటయ్యే ఫుడ్ పార్కుల్లో ఆయా ఆహార ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 13వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. దీంతో మామిడి పండ్లను ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మ్యాంగో చాకెట్లు, జ్యూస్లు, జామ్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో పాల ఉత్పత్తి ఎక్కువ దీంతో ఫుడ్ పార్కులో డెయిరీకి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయవచ్చు. ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో గొర్రెలను పంపిణీ చేసింది. దీంతో ఫుడ్ పార్కులో మాంసం ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవకాశముంది. సంగారెడ్డి జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ ఉన్నందున ఎగ్, పౌల్ట్రీ ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫుడ్పార్కులో బేకింగ్, స్నాక్స్కు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంది. ఫుడ్ పార్కుల్లో పెద్ద సంఖ్యలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు అయితే పెద్ద సంఖ్యలో స్థానిక యువతకు ఉపాధి లభించనుంది.