తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 8: కొండపోచమ్మసాగర్ నుంచి గోదావరి జలాలను హల్దీవాగు, మంజీర నదిలోకి తరలించడంతో తూప్రాన్, వెల్దుర్తి, నర్సాపూర్ మండలాలమీదుగా నేరుగా నిజాంసాగర్, సింగూర్ ప్రాజెక్టుకు సాగునీరు అందుతుందని, దీని పరిసర ప్రాంతాల్లోని 32 చెక్డ్యాంలు నిండి 14,268 ఎకరాల పంటపొలాలకు సాగునీరందుతుందని రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. కిష్టాపూర్ చెక్డ్యాం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా తూప్రాన్ పెద్దచెరువులోకి సాగునీటిని తరలిస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, లిఫ్ట్ ఇరిగేషన్ ఈఈ (ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్) హీమానాయక్తో కలిసి గురువారం పట్టణ శివారులోని కిష్టాపూర్ చెక్డ్యాంను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో రెండ్రోజుల్లో హల్దీవాగులోకి కొండపోచమ్మసాగర్ నుంచి సాగునీరు రాబోతుందన్నారు. కిష్టాపూర్ వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకానికి కేటాయించిన కరెంట్ బోర్లు, మీటర్లు, పైప్లైన్లు, ఇతర సామగ్రి చెడిపోయాయని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారి ఆదేశాల మేరకు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయించి హల్దీవాగు నీటి ని తూప్రాన్ పెద్ద చెరువులోకి మళ్లించడం ద్వారా ఆయకట్టు కింద ఉన్న బీడు భూములకు సాగునీరు లభిస్తుందని, పంటపొలాలు కళకళలాడుతాయన్నారు. హల్దీవాగులోకి సాగునీరు చేరడం ద్వారా తూప్రాన్తో పాటు మండలంలోని యావాపూర్, కిష్టాపూర్, వెంకటరత్నాపూర్, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, దాతర్పల్లి, నాగులపల్లి శివారులోని సాగునీటి బోర్లలో నీటిమట్టాలు పెరుగుతాయన్నారు. ఎండ, వానకాలాల్లో బీడు భూములకు సాగునీరందుతుందని, రైతులు రాజులుగా మారుతారన్నారు. రైతాంగం శ్రేయస్సు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ఘనత ఒక్క సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుమ్మరి రఘుపతి, సతీశ్చారి, మామిండ్ల కృష్ణ, వెంకటేశ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.