గుమ్మడిదల, మే 30: మండల పరిధిలోని అన్నారం పల్లెప్రగతితో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామంలో నలుదిక్కులా పోతరాజుకుంట, చెల్లయికుంట, కొత్తచెరువు, రామేశ్వరం చెరువు మిషన్కాకతీయ పథంతో పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. మిషన్భగీరథ పథం ద్వారా మూడు ట్యాంకులు, ప్రజల దాహం తీర్చడానికి పది మినీట్యాంకులు, అత్యవసర సేవలు అందించడానికి పంచాయతీ నుంచి అంబులెన్స్ సౌకర్యం. ఎక్కడ చూసినా సీసీ రోడ్లతో అన్నారం గ్రామం పట్టణ వాతావరణం, పచ్చని గ్రీన్బెల్ట్తో ప్రజలకు ఆహ్లాదపరుస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. దీంతో గ్రామంలోని ప్రగతిని చూసి ప్రజలు మురిసిపోతున్నారు.
ఆదర్శంగా కేసీఆర్ కాలనీ..
అన్నారం గ్రామశివారులోని ఎక్స్సర్వీస్మెన్ కాలనీని కేసీఆర్ కాలనీగా పేరు మార్చి ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతున్నారు. కాలనీలో చెత్తను తరలించడానికి ట్రాక్టర్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, అమ్మవారి గుడి ఏర్పాటు చేశారు. కాలనీలో అన్ని రోడ్లు సీసీ రోడ్లుగా మార్చారు.
ప్రకృతి నివాస్..
పచ్చని వాతావరణంతో అటు పల్లె.. ఇటు పట్టణవాతావరణాన్ని అందించేవిధంగా అన్నారంలోని ప్రకృతి నివాస్ కాలనీ ఉంది. ఇందులో ప్రతి ఇంటి వద్ద పచ్చని మొక్కలతో ఆకుపచ్చని వాతావరణంతో కనువిందు చేస్తుంది. మోడల్ కాలనీగా పేరుగాంచింది.
పల్లెప్రగతిలో..
పల్లెప్రగతిలో పాతబడిన మూడు బావులను పూడ్చివేశారు. శిథిలావస్థలో ఉన్న ఐదు ఇండ్లను చదును చేశారు. ఇంటింటికీ తడి,పొడి చెత్తను సేకరించడానికి బుట్టలు అందించారు. ప్రతి ఇంటికి తాగు నీరందించడానికి మిషన్భగీరథ ద్వారా నల్ల కనెక్షన్లు ఇచ్చారు. ఏండ్లనాటి విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. వైకుంఠధామాన్ని, నర్సరీ, డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. డంపింగ్యార్డుకు తరలించడానికి జీపీ నుంచి ట్రాక్టరు, రిచార్జ్ ఆటోలను అందుబాటులో ఉంచారు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఆపదకాలంలో ఉన్న వారికి వైద్యానికి అందించడానికి అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. నర్సరీలో రెండు వేల మొక్కలను పంచారు. ప్రతిఇంటికీ మొక్కలను అందించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు.