సంగారెడ్డి, మార్చి 27 : గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న తెలంగాణ టాప్లో నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో గిరిజన న్యాయ కళాశాలను మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు జాతీయ రహదారి పక్కన రాక్ చర్చిలో క్రైస్తవుల సమాధుల తోటకు స్థలం కేటాయిస్తూ పత్రాలను క్రైస్తవ సోదరులకు అందజేశారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియాన్ని ప్రారంభించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 46 మంది లబ్ధిదారులకు అందజేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీ, బోధన తరగతి గదులను పరిశీలించారు. కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశం ఇరుకుగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసి సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గిరిజనులకు మెరుగైన విద్య అందించాలనే తపనతో సీఎం కేసీఆర్ ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. అలాగే, న్యాయశాస్త్ర చదువుల కోసం రాష్ట్రంలో రెండు లా కళాశాలలను సంగారెడ్డిలో బాలుర, ఎల్బీ నగర్లో బాలికల కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ సర్కార్కే దక్కిందన్నారు. గిరిజన విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చేసిన సేవలను చెప్పాలని అధ్యాపకులకు సూచించారు. గిరిజ బాలికలకు 15, బాలురకు 7 కళాశాలలు, బీసీ మహిలలకు ప్రత్యేక కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి విద్యను అందిస్తుందన్నారు. పూర్తిగా గిరిజన జనాభా ఉన్న జార్ఖాండ్లో లేనివిధంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేసి ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
శ్మశానవాటికకు ఐదెకరాలు..
క్రైస్తవుల శ్మశానవాటికకు ప్రభుత్వం 5 ఎకరాలు భూమిని కేటాయించిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు నిధుల నుంచి రూ.10లక్షలు, పార్దీవ వాహనానికి రూ.15 లక్షలు మాజీ ఎమ్మెల్యే మంజూరు చేయిస్తానని ముందుకు రావడం గొప్పవిషయమన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆడిటోరియంలో ఫర్నిచర్, డైనింగ్హాల్ కోసం చైర్మన్ అడిగిన విధంగా నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. యోగా కేంద్రంలో మ్యాట్లు అందజేసి వసతి కల్పిస్తామన్నారు.
గిరిజనుల ఆరాధ్యుడు సీఎం కేసీఆర్…