పటాన్చెరు, మే 25 :
ఆక్సిజన్ తయారీలో ముందడుగు పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఏడేండ్లుగా మూతపడి ఉన్న ఏయిర్ వాటర్ ఇండియా ఆక్సిజన్ తయారీ పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో పునరుద్ధరణకు నోచుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆరునెలల పనిని గ్రీన్కో సంస్థ కేవలం నెలరోజుల్లో పూర్తి చేసి, మంగళవారం ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఇండస్ట్రీయల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ నర్సింహరెడ్డితో కలిసి సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెలరోజులుగా ప్లాంట్ పునరుద్ధరణ పనులు సాగాయన్నారు. 2014నుంచి ఉత్పత్తి నిలిచిపోయిన ఏయిర్ వాటర్ ఇండియా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లో మెడికల్ ఆక్సిజన్ తయారీకి అవకాశం ఉందని గుర్తించి, పరిశ్రమ ప్రతినిధులను సంప్రదించి ఆ ప్లాంట్ పునరుద్ధరణకు పని చేశామన్నారు. గ్రీన్కో సంస్థ ప్లాంట్ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిందన్నారు. ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైందని, 4, 5రోజుల్లో అన్ని రకాలుగా ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 1 వరకు మెడికల్ ఆక్సిజన్ కమర్షియల్గా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 40టన్నుల నుంచి 45టన్నుల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. గతంలో 125 మెట్రిక్ టన్నులుండేవన్నారు. 30శాతం అధికంగా ఉత్పత్తి చేయగలుగుతున్నామన్నారు. గ్రీన్కో సంస్థ చైర్మన్ అనిల్ పూర్తి స్థాయిలో పనిచేసి విజయవంతం చేశారని ఆయన బృందాన్ని కొనియాడారు. ప్లాంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని సిబ్బంది చెప్పడంతో ఆయన వారితో సంతోషంగా సంభాషించారు. త్వరలో ఆక్సిజన్ కొరతలేని రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానల అవసరాలను యుద్ధ ప్రాతిపదికన తీర్చేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు పోతున్నామన్నారు.
రీఫిల్లింగ్కు స్థలం కేటాయింపు..
తెలంగాణలోని దవాఖానలకు ఆక్సిజన్ రీఫిలింగ్ చేసేందుకు టీఎస్ఐఐసీ ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. రూ.15కోట్ల ఖర్చుతో ఈ స్థలంలో ఆక్సిజన్ రీఫిల్లింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పారిశ్రామికవాడలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ను ఇక్కడి నుంచి రీఫిల్లింగ్ చేసేందుకు అధికారులు ఈ స్థలంలో ప్లాంట్ను నిర్మించేందుకు స్థలం కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఐలా పాశమైలారం అధ్యక్షులు దుర్గాప్రసాద్, ఐలా ప్రతినిధులు చందుకుమార్, సత్యనారాయణ, రాఘవరెడ్డి, రాజు, రమణారెడ్డి, టీఎస్ఐఐసీ అధికారులు పాల్గొన్నారు.