కంది, మే 25 : భూమిలో పంటలను కాపాడే సూక్ష్మజీవుల సంరక్షించడంలో కృషి చేసిన సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం చెర్యాల్ గ్రామానికి ఈ ఏడు ఉత్తమ బీఎంసీ (బైయో డైవర్సిటీ మానేజ్మెంట్ కమిటీ 2021) అవార్డు దక్కింది. ఈ అవార్డు తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు (టీఎస్బీడీబీ) ఐఏఎస్ అయిన రాష్ట్ర కార్యదిదర్శి కాలిచరణ్ ఖర్తడే మంగళవారం ప్రకటించారు. అయితే గతంలో ఈ అవార్డు ఎంపిక ప్రక్రియలో గ్రామంలో వీటి రక్షణ కోసం కృషి చేస్తున్న ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం రూ.2లక్షలు కూడా ఈ సంస్థ ద్వారా అందుకుంది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సడలింపు తర్వాత మంత్రుల చేతుల మీదుగా హైదరాబాద్లోని ఆర్యన భవన్లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో అందజేయనున్నారు. ఈ అవార్డు ప్రకటించడంతో స్థానిక చెర్యాల్ గ్రామ ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సూక్ష్మజీవ రక్షణలో చెర్యాల్ భేష్..
రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు (టీఎస్బీడీబీ) ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ అంశాలపై క్షేత్రస్థాయిలో ఆ బోర్డు అధికారులు పర్యటించి ఉత్తమంగా నిలిచి గ్రామ పంచాయతీలకు ఆ రంగాల్లో అవార్డు ప్రదానం చేస్తారు. ఈ బోర్డు ఆధ్వర్యంలో ప్రధానంగా అడువులు, జంతువులు, వన్యప్రాణులు, తృణధాన్యములు, సూక్ష్మజీవులు, వారసత్వ సంపద ఇలా వివిధ అంశాలపై గ్రామాల్లో పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమంగా నిలిచి గ్రామానికి వారు నగదు పురస్కారంతో పాటు అవార్డును అందజేస్తుంటారు. ఈ సారి 2021 గాను సంగారెడ్డి జిల్లాలో కంది, నారాయణఖేడ్, మనూర్, న్యాల్కల్, జహీరాబాద్లో మొత్తం15 గ్రామాలను సూక్ష్మజీవుల సంరక్షణ విభాగంలో అధికారులు ఎంపిక చేశారు. ఇందులో కంది మండలంలోని చెర్యాల్, ఇంద్రకరణ్, జుల్కల్, కాశీపూర్ గ్రామాలను చివరగా అవార్డు కోసం ప్రతిపాదించి పంపించారు. ఇందులో రాష్ట్ర అధికార బృందం ఆధ్వర్యంలో చెర్యాల్ గ్రామనికి ఉత్తమ బీఎంసీ అవార్డును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చెర్యాల్ గ్రామ పరిధిలో సూక్ష్మజీవులు అధికంగా ఉన్నందున, వాటిని ఇక్కడి గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో సంరక్షిస్తున్నందున ఈ అవార్డు ప్రకటించడం జరిగిందని అధికారులు తెలిపారు.