సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 25 : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ యువత కోసం అందిస్తున్న కార్పొరేషన్ రుణాల్లో భాగంగా లబ్ధిదారులు అవగాహనలేమితో దరఖాస్తులు చేసుకున్నారు. ఒకే యూనిట్కు వందలాది మంది దరఖాస్తులు చేసుకోవడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ లాభసాటి లేని పథకాలతో ఇబ్బందులు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఉన్న పథకాలకు ఈ ఏడాది దాదాపు రెట్టింపు పథకాలను ప్రభుత్వం అందిస్తున్నది. అయితే అందులో కొన్ని పథకాలు గ్రూప్ యూనిట్ల కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మొత్తం 7,234 మంది లబ్ధిదారులు ఈ ఏడాది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల అవగాహన కోసం నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం…
ఇతర పథకాలకు దరఖాస్తును మార్చుకోవాలనుకునే వారికి ప్రభుత్వం ఈనెల 31వరకు గడువును పొడిగించింది. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేవలం 47 రకాల పథకాలకు మాత్రమే రుణాలు అందించే వారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ సంఖ్యను 84 రకాల పథకాలకు పెంచింది. 2020-21 వార్షిక ప్రణాళికలో భాగంగా మొత్తం 84 రకాల పథకాలకు సంబంధించిన రుణాలను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నారు. అయితే ఈ ఏడాది జిల్లాలో మొత్తం 7234 దరఖాస్తులు రాగా.. అందులో అత్యధికంగా 1702 దరఖాస్తులు పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసుల తయారీ కోసం అందడం విశేషం. ఈ పథకం లాభసాటిగా లేనందున లబ్ధిదారులు వేరే పథకాన్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బ్యాంకుతో సంబంధం లేకుండా రూ.50 వేల చిన్న తరహా వ్యాపార యూనిట్ల కోసం మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే సబ్సిడీ రుణాలకు సంబంధించి రెండు రకాల యూనిట్లుగా గుర్తించారు. ఒకటి నైపుణ్యం గల యూనిట్లు, రెండోది నైపుణ్యత లేని యూనిట్లుగా రుణాలను ఇవ్వడం జరుగుతుంది. అయితే నైపుణ్యత లేని పథకాల యూనిట్లకు మండల స్థాయిలో కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక విధానం ఉంటుంది. నైపుణ్యం గల పథకాల యూనిట్లకు జిల్లా స్థాయిలో ఎంపికలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీనికి అదనంగా రూ.5 లక్షల యూనిట్లను పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. గతేడాది అవగాహన లేక పూర్తి స్థాయిలో పథకాలను సద్వినియోగం చేసుకోలేదని, ఈసారి లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాకు రూ.42 కోట్ల సబ్సిడీ కేటాయించామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు ఈ సందర్భంగా వెల్లడించారు.
గ్రూప్ యూనిట్లకు వ్యక్తిగత దరఖాస్తులు చేసుకోరాదు..
అయితే నిర్దేశించిన 84 యూనిట్లలో 13 యూనిట్లు గ్రూప్ యాక్టివిటీ కింద గుర్తించి లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయం తెలియక జిల్లాలో 543 మంది గ్రూప్ యూనిట్ అయిన రెడీమేడ్ యూనిట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా గ్రూప్ యాక్టివిటీ యూనిట్లు అయిన స్ట్రీట్ వెండర్స్ కోసం 184 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, బ్రిక్ మేకింగ్ కోసం 132 మంది, డిటెర్జెంట్ పౌడ ర్ కోసం 10 మంది దరఖాస్తు చేసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరంతా వెంటనే గ్రూప్ యాక్టివిటీ యూనిట్ల నుంచి మరో పథకానికి మార్చుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. బ్యాండ్ సెట్, సిమెంట్ బ్రిక్స్, డిటెర్జెంట్ పౌడర్, ఫిష్ పాండ్, నీమ్ ఆయిల్, పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు, రీసైకింగ్ల్స్, రెడీమేడ్స్, టర్మెరిక్, డిజిటల్ నెట్వర్క్ వంటి మొత్తం 13 యూనిట్లు గ్రూప్ యూనిట్లు అయినందున 5 మంది సభ్యులు గ్రూప్గా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాలకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నవారందరూ వెంటనే మరో యూనిట్కు మార్చుకోవాలి. అందుకోసం ఈ నెల 31 వరకు అవకాశం కల్పించారు. కాగా, కొత్తగా సబ్మెర్సిబుల్ పంపు, ల్యాండ్ డెవలప్మెంట్ స్కీం, కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు.