జహీరాబాద్, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో జహీరాబాద్ ప్రాంత రైతులు అల్లం పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో అల్లం విత్తనాన్ని రైతులు కేరళ నుంచి కొనుగోలు చేసి తెచ్చి పంట వేసేవారు. ప్రస్తుతం స్థానికంగానే విత్తనాన్ని రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. కేరళ నుంచి విత్తనం కొనుగోలు చేసి తెచ్చి వేయడంతో రైతులకు రవాణా ఖర్చులు భారంగా ఉండేవి. జహీరాబాద్ భూములు అల్లం పంటకు అనుకూలంగా ఉండడంతో రైతులు పంట మార్పిడి పాటించి సాగుచేస్తున్నారు. గతంలో చెరుకు , ఇతర పంటలు సాగుచేసే ఇక్కడి రైతులు, ప్రస్తుతం అల్లం సాగుచేస్తున్నారు. గతేడాది భారీ వర్షాలకు అల్లం రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అయినా ఇతర పంటల కంటే అల్లం సాగే ఈ ఏడాది మరింతగా సాగుచేస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంట్, వ్యవసాయ బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులకు సాగు అనుకూలంగా మారింది. అల్లం సాగుచేసే రైతులకు సబ్సిడీపై బిందుసేద్యం పరికరాలను ప్రభుత్వం అందిస్తున్నది. అంతేకాకుండా ఉద్యాన వన శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తున్నది. ఈ ప్రాంత రైతులు పేడ, ఇతర సేంద్రియ ఎరువులతో అల్లం పంటను సాగు చేస్తుండడంతో ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నది. రసాయన ఎరువుల వాడకం తగ్గించారు.
అల్లం సాగువైపు జహీరాబాద్ రైతులు..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా జహీరాబాద్, కోహీర్, మొగుడంపల్లి, న్యాల్కల్ , ఝరాసంగం మండలంలో రైతులు అల్లం సాగుచేస్తున్నారు. గతేడాది 270 ఎకరాల్లో సాగుచేయగా, ఈసారి 300 ఎకరాల్లో పండిస్తున్నారు. జహీరాబాద్లో అల్లం పంట అమ్మకాలకు మార్కెటింగ్ సౌకర్యం లేదు. మార్కెట్లో ధర లేని సమయంలో నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు లేవు. దీంతో రైతులు మార్కెట్లో ఉన్న ధరకు పంట అమ్ముకుంటున్నారు. అల్లం పంట సాగుకు రైతులు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతున్నది. పంట సాగుచేసే సమయంలో విత్తనాలకు భారీగా ధర ఉంటున్నది. రైతులు పండించిన పంట చేతికి రాగానే మార్కెట్లో ధర లేక పెట్టిన ఖర్చులు రాని పరిస్థితులు ఉంటున్నాయి. గతేడాది భారీ వర్షాలకు పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు.
అధిక పెట్టుబడితో అల్లం సాగు ..
తెలంగాణలో అత్యధికంగా అల్లం పంటను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో సాగుచేస్తున్నారని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 80శాతం అల్లం ఇక్కడే సాగవుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఎర్రమట్టి అల్లానికి భారీగా డిమాండ్ ఉంటుంది. రైతులు అల్లం పంట సాగుచేసేందుకు కేరళ నుంచి అల్లం విత్తనం ప్రతి ఏడాది తీసుకు వచ్చేవారు, ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. జహీరాబాద్ రైతులు నాణ్యమైన అల్లాన్ని పండించి రైతులకు విత్తనం కోసం అమ్మకాలు చేస్తున్నారు. ఎకరాకు రైతులు 6,7 క్వింటాళ్ల విత్తనం కొనుగోలు చేసి వేస్తారు. అల్లం పంట 200 రోజులో చేతికి వస్తుంది. ఎకరాకు అల్లం దిగుబడి 7నుంచి 12 టన్నుల వరకు వస్తుంది. మార్కెట్లో ఉన్న ధరను బట్టి రైతులకు లాభం ఉంటుంది.
మద్దతు ధర ప్రకటించాలి..
ప్రభుత్వం అల్లానికి మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జహీరాబాద్లో అల్లం మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ వ్యాపారులు సిండికేట్గా మరి తగిన ధర చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే అల్లానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. విత్తనం నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు లేక రైతులు కేరళ నుంచి విత్తనం కొనుగోలు చేయాల్సి పరిస్థితి నెలకొంది. శీతల గిడ్డంగులు ఉంటే మార్కెట్లో ధర లేని సమయంలో పంటను నిల్వచేసి మార్కెట్లో ధర రాగానే అమ్ముకునే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో ధర లేకపోతే రైతులు ఏడాది పాటు భూమిలోనే అల్లాన్ని వదిలివేస్తారు. మార్కెట్లో ధర రాగానే పంటను తీస్తారు. అల్లాన్ని ఏడాది పాటు భూమిలో ఉంచినా ఎలాంటి నష్టం ఉండదు. ఈ ఏడాది మార్కెట్లో ధర లేకపోవడంతో రైతులు నష్టపోయారు. వాతావరణం అనుకూలంగా ఉండి పంట దిగుబడి పెరిగినా, ధర లేక రైతులకు గిట్టుబాటు కాలేదు. సర్కారు మద్దతు ధర కలిపించాలని రైతులు కోరుతున్నారు.
మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు..
రాష్ట్రంలో అత్యధికంగా అల్లం పంటను జహీరాబాద్లో సాగుచేస్తుండగా, స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు హైదరాబాద్ మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు. చిన్న, సన్న కారు రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. విత్తనం వేసే సమయంలో అల్లానికి మార్కెట్లో అధిక ధర ఉంటున్నది. పంట చేతికి రాగానే మార్కెట్లో ధర లేక రైతులు ఉన్న ధరకు పంటను అమ్మకోవాల్సిన పరిస్థితి ఉంది. శీతల గిడ్డంగుల నిర్మాణం చేసి, మార్కెటింగ్ సౌకర్యం కలిపించాలని రైతులు కోరుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ప్రభుత్వం పంటలు నిల్వ చేసేందుకు గోదాములు నిర్మించింది. దీంతో రైతులు అల్లాన్ని నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.