ట్రాక్టర్ ద్వారా చెత్తసేకరణ
ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు
డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుతో తీరిన మురుగు సమస్య
అందుబాటులో వైకుంఠధామం, డంపింగ్యార్డు, రైతు వేదిక, నర్సరీ
కంగ్టి, మే 22: వెనుకబడిన గ్రామంగా ముద్రపడ్డ కంగ్టి ఇప్పుడు పల్లెప్రగతితో కొత్త రూపును సంతరించుకుంది. వెనకబాటును దూరం చేసుకొని అభివృద్ధి దిశగా గ్రామం పయనిస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు కంగ్టిలో పరిసరాలు, రోడ్ల్థు, డ్రైనేజీ వ్యవస్థ ఆధ్వానంగా ఉండేది. పల్లెప్రగతి అమలు తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. గ్రామ చౌరస్తా నుంచి విశాలమైన డబుల్ సిమెంట్రోడ్డు, బట్టర్ఫ్లై విద్యుత్ దీపాల కాంతులతో గ్రామం వెలుగుతున్నది. కంగ్టి గ్రామపంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నది. గ్రామంలో రైతువేదిక, వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు చేశారు. నిత్యం ఇంటింటా వెళ్లి పంచాయతీ పారిశుధ్య సిబ్బంది ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. దానిని ప్రతిరోజు డంపింగ్యార్డుకు తరిలిస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన మురుగు కాలువలు అధ్వానంగా మారి గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. మురుగు రోడ్లపైన పారడంతో దుర్గంధంతో గ్రామస్తులు అవస్థలు పడ్డారు. పల్లెప్రగతి కార్యక్రమంలో పంచాయతీ నిధులతో డ్రైనేజీలు నిర్మించడంతో మురుగు సమస్య తీరికంది. గ్రామంలో శిథిలావస్థకు చేరిన 10 పాడుబడ్డ ఇండ్లు, 6 శిథిల బావులను పూడ్చివేశారు. దీంతో అక్కడ పరిసరాలు శుభ్రంగా మారాయి. సీజనల్ వ్యాధులు రాకుండా వారానికోసారి మురుగు కాలువల్లో బ్లీచింగ్పౌడర్ జల్లడం, రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. గ్రామశివారులో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ప్రతిరోజు ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. గ్రామంలో గతంలో కేవలం రెండు నీటిట్యాంకులు ఉండేవి.కొత్తగా మిషన్ భగీరథ కింద మూడు నీటిట్యాంకులను ప్రభుత్వం నిర్మించింది. దీంతో సుమారు 1200 కుటుంబాలకు ప్రతిరోజు నల్లా ద్వారా స్వచ్ఛమైన నీళ్లు అందుతున్నాయి. కంగ్టి గ్రామంలో నీటి సమస్య తీరింది.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు..
కంగ్టిలో పల్లెప్రగతితో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. రూ.22లక్షలతో రైతువేదిక, రూ.12లక్షలతో వైకుంఠధామం, రూ.2.50లక్షలతో డంపింగ్యార్డు నిర్మించారు. రూ.6 లక్షలతో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశారు. గ్రామంలో హరితహారం కింద మొక్కలు నాటేందుకు రూ. 2లక్షలతో నర్సరీ ఏర్పాటు చేశారు. రూ.7.50 లక్షలతో ట్రాక్టర్ ఇంజిన్, ట్రాలీ, నీటిట్యాంకర్, రూ. 10లక్షలతో గ్రామంలో మురుగుకాలువల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త డబ్బాలను అధికారులు అందజేశారు.
గ్రామస్వరూపం
జనాభా: 3750
నివాసగృహాలు : 825
వార్డులు : 12
పంచాయతీ సిబ్బంది: 8
అంగన్వాడీ కేంద్రాలు : 4
జడ్పీ ఉన్నత పాఠశాల: 1
ప్రాథమిక పాఠశాల: 1
నీటి ట్యాంకులు : 5
సామాజిక పింఛన్లు : 415
చెరువులు : 1
గ్రామస్తుల
సహకారం బాగుంది
పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన పనులను గ్రామస్తుల సహకారంతో సకాలంలో పూర్తిచేశాం. పారిశుధ్యం, మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాం. జీపీ నిధులతో మురుగు కాలువలు నిర్మించాం. గ్రామస్తులు అన్నివిధాలుగా సహకరిస్తున్నారు.
పల్లెప్రగతితో గ్రామం అభివృద్ధి..
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామం మరింతగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న పారిశుధ్య సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రతిరోజు ప్రతిగల్లీ నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డు కు తరిలిస్తున్నారు. గ్రామంలోని పరిసరాలు ప్రస్తుతం ఉన్నాయి. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల్లో రసాయనాలు పిచికారీ చేయిస్తున్నాం.
టీఆర్ఎస్తో గ్రామంలో అభివృద్ధి ..
టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామం అభివృద్ధి చెందింది. గతపాలకులు గ్రామపంచాయతీలను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండేది. పల్లెప్రగతితో గ్రామస్వరూపం మారింది. గ్రామంలో పచ్చదనం, పారిశుధ్యం బాగుంది.