సంగారెడ్డి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : కరోనా కట్టడికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు ఎప్పటికప్పుడు అధికారులతో కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. కరోనా విస్తరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ర్టాలు మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సంగారెడ్డి జిల్లాలోకి రాకపోకలు కొనసాగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు అధికారులు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని దేగుల్వాడి, నాగూర్ (కె), సిద్దంగిర్గా గ్రామాలు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ గ్రామాల గుండా రాకపోకలు సాగించకుండా అధికారులు మూడుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. నాగల్గిద్ద మండలంలోని కరస్గుత్తి గ్రామం కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ఇక్కడా ప్రజల రాకపోకలను కట్టడి చేసేందుకు చెక్పోస్టును ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుంచి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎవరూ జిల్లాలోకి ప్రవేశించకుండా చెక్పోస్టులను రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
అంతకంతకూ పెరుగుతున్న కేసులు..
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నది. వారం రోజులుగా జిల్లాలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 10,328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1486 మంది ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. కరోనాతో మొత్తం 74 మంది మృతి చెందారు. సంగారెడ్డి, సదాశివపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, జహీరాబాద్ తదితర పట్టణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నది. సంగారెడ్డి జిల్లాలో ప్రతిరోజూ 4వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ వేగంగా జరిగేలా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 79,278 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని గ్రామాల నుంచి ట్రాక్లర్లు, ఇతర వాహనాలు కట్టుకొని టీకా కోసం దవాఖానలకు వెళ్తున్నారు.
అప్రమత్తతోనే కరోనా దూరం..
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తే ప్రజలు కరోనాకు దూరంగా ఉండవచ్చు. కరోనా తీవ్రతను తక్కువగా అంచనా వేస్తూ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ ధరించకపోవటం, భౌతికదూరం పాటించకపోవటం చేస్తున్నారు. వెంట శానిటేషన్ ఉంచుకోవడం లేదు. కరోనా సోకవద్దంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలి. అలాగే భౌతికదూరం పాటించడంతో పాటు తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. వైద్యుల సూచనలు పాటించాలి.
మెదక్, సిద్దిపేట జిల్లాల్లో…
సంగారెడ్డితో పోలిస్తే మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నది. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. మంత్రి హరీశ్రావు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సోమవారం సిద్దపేట జిల్లాలో పీహెచ్సీని మంత్రి సందర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎమ్మెల్యేలు కరోనా వ్యాక్సినేషన్పై వారివారి నియోజకవర్గాల్లో పర్యవేక్షిస్తున్నారు.
అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా..
కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దుల్లో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేశాం. అవసరమైన చోట చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. కరోనా సోకిన వారికి ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందజేస్తున్నాం. ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించటంతో పాటు భౌతికదూరం పాటించాలి. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి. నిర్లక్ష్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.
ఇవీ కూడా చదవండి…