మునిపల్లి, జూన్ 19 : చెట్టు నంబర్ వన్ అయితే కాయ నంబర్ వన్ అవుతున్నదని ఓ సినిమాలో డైలాగ్.. మరి చెట్టే నంబర్ వన్ కావాలంటే విత్తనం మరింత నంబర్ వన్ కావాలి. రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. విత్తనాలు కొనేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ, నాణ్యత లేని విత్తనాలను అంటగట్టే పనిలో కొందరు వ్యాపారులుంటారు. విత్తనాలు కొనుగోలు చేయడమే తప్ప వాటి స్థితిగతులను గమనించకపోవడంతో రైతులు ఏటా నష్టాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. రైతులు నిర్లక్ష్యం వహిస్తే తీరని నష్టం వాటి ల్లుతున్నది.
వానకాలం పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. మునిపల్లి మండలంలో రైతులు పత్తి పంటను అధికంగా పండిస్తారు. రైతులు ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తనాలు కొంటుంటారు. ఇదే అదనుగా భావిస్తున్న కొంతమంది వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తారు. తక్కువ ధరకు ఇస్తుండడంతో నాణ్యత లేని విత్తనాలైనా సరే రైతులు కొనుగోలు చేస్తుంటారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా లాభాల సాగు చేయవచ్చు.
మునిపల్లి మండలంలో అనుమతులు లేని ఫర్టిలైజర్ దుకాణాలు చాలా ఉన్నాయి. మండలంలోని సంబంధిత శాఖ అధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని రైతులు కోరుతున్నారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. గతంలో మునిపల్లి మండలంలోని బుధేరా చౌరస్తాలో ఓ వ్యాపారి రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో తీవ్రంగా నష్టపో యారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి విత్తనాల స్టాక్, రిజిస్టర్లను పరిశీలించాలి.
విత్తనాలపై రైతులు తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి. కొన్న ప్యాకెట్లో ఉన్న విత్తనాలు ఎంత శాతం మొలకెత్తుతాయో చూసుకోవాలి. పంటకాలం పూర్తయ్యేవరకు రైతులు కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్లతో పాటు రసీదులను తప్పకుండా ఉంచుకోవాలి. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాలు అమ్మితే వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలి.
శివకుమార్, వ్యవసాయధికారి, మునిపల్లి