సంగారెడ్డి కలెక్టరేట్ 18 : జిల్లాలోని అర్హులందరికీ త్వరలో కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసేందుకు పూర్తి స్థాయిలో స్క్రూటీని పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్కు సూచించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లులకు తరలింపు, చెల్లింపులు, కొత్త ఆహార భద్రత కార్డుల జారీపై కలెక్టర్, పౌర సరఫరాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడారు. జిల్లాలో గత సంవత్సరం యాసంగిలో 56 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా, ఈ యాసంగిలో అంతకు మూడు రెట్లకు పైగా ధాన్యం వచ్చిందన్నారు. ఈ సారి యాసంగి 2020-21లో 35,372 మంది రైతుల నుంచి రూ.336.56 కోట్ల విలువ గల లక్షా 76వేల 672 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రికి వివరించారు. 33,638 మంది రైతులకు రూ.316.49 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. ఇంకా 1734 మంది రైతులకు రూ.17 కోట్లను ఒకటి రెండు రోజుల్లో జమ చేస్తామని మంత్రికి వివరించారు. ధాన్యం మొత్తం మిల్లింగ్ కోసం 19 బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామని తెలిపారు.
జిల్లాలో 12,969 దరఖాస్తులు..
జిల్లాలో ఆహార భద్రత కార్డుల కోసం 12,969 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, అర్హులను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి, సివిల్ సైప్లెయ్ డీఏం సుగుణ బాయి, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి..
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొని ఇప్పటికే వివిధ స్థాయిలో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పరిశీలించి అర్హులైన వారికి వెంటనే ఆహార భద్రత కార్డులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ను సూచించారు. శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్త ఆహార భద్రత కార్డుల జారీ, వరి ధాన్యం సేకరణ, చౌకధర దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీ వారి సమస్యలపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ఆహార భద్రత కార్డుల జారీ కోసం లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. 4.15లక్షల దరఖాస్తులు ఆయా స్థాయిలో పెండింగ్లో ఉన్నవాటిని పరిశీలించి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.
యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ చేయించి ఎఫ్సీఐకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకధర దుకాణా డీలర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడారు. జిల్లాలో మూడు రెట్లు అధికంగా వరి ధాన్యం ఉత్పత్తి అయిందని కొనుగోలు చేసిన ధాన్యాన్ని విల్లులకు పంపించామని వివరించారు. జిల్లాలో కొత్తగా 4.381 ఆహార భద్రత కార్డులు మంజూరు చేయాల్సి ఉన్నాయన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు వివిధ స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి మంజూ రు చేస్తామన్నారు. సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ అనీల్ కుమార్, అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాసులు ఆర్డీవో సాయిరాం, డీఈవో రమేశ్ కుమార్ పాల్గొన్నారు.