సంగారెడ్డికి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులైన జ్ఞానేశ్వర్, కిరణ్, సతీష్ స్నేహితులు. ప్రస్తుతం కొవిడ్ బాధితులు భోజన వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించిన వీరు, వారికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 16న సృష్టి ఆర్గనైజేషన్ పేరిట సంగారెడ్డి పట్టణంలో కొవిడ్ బారిన పడిన వారి వివరాలను సేకరించి, అవసరమున్న వారికి రెండు పూటలా మధ్యాహ్న, రాత్రి భోజనాన్ని నేరుగా ఇంటికే పంపిస్తున్నారు. మొదటి రోజున సుమారు 70-80 మంది బాధితుల ఇంటికే భోజనాన్ని అందజేశారు. సంగారెడ్డిలోని ఎంటీఎస్ క్యాటరింగ్ ద్వారా భోజనాన్ని తయారు చేయించి, పూర్తి పౌష్టికాహారాన్ని(గుడ్డుతో) పాటు తయారు చేస్తున్నామని జ్ఞానేశ్వర్ చెప్పారు. వండిన భోజనాన్ని గ్రీన్ జోన్ డెలివరీ సంస్థ సభ్యుల ద్వారా బాధితుల ఇంటికి చేరవేస్తున్నామని, లాక్డౌన్ ముగిసే వరకు దీనిని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఒకవేళ అవసరాన్ని బట్టి లాక్డౌన్ అయిపోయినా కూడా తమ సేవ కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్గనైజేషన్ సభ్యులు చెబుతున్నారు. ఎవరికైనా కొవిడ్ బాధితులకు ఇంటి వద్దకే భోజనం కావాలంటే సెల్ : 9966943654(జ్ఞానేశ్వర్), 7842288121(కిరణ్), 9966209082(సతీష్)కు సంప్రదించాలని వారు చెబుతున్నారు. వీరితో పాటు ఆకలి సంస్థ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన రాజేందర్ కూడా తనవంతుగా గతంలో చేసిన విధంగా ఈసారి కూడా పేదలకు, కొవిడ్ రోగులకు ఉచితంగా భోజనాన్ని అందజేస్తున్నారు.