కంది, మే 17: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రంగా మారింది. కొవిడ్ వచ్చిందంటే చాలు ప్రజల ప్రాణాలు పోతాయనే భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు గుడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు వదిలిపోతుందోనంటూ దేవుళ్లకు మొక్కని వారంటూ లేరు. కరోనా సెకండ్ వేవ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ఎంతో మంది ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే, సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతి ఇంట్లో వారికి భయం ఎక్కువగా మొదలైంది. ఇంట్లోని వ్యక్తికి కరోనా సోకితే ఇతర కుటుంబ సభ్యులు కూడా వారితో ఉండడానికి జంకుతున్నారు. చాలా మంది దవాఖానలకు వెళ్లమని, నీ ఒక్కరి వల్ల ఇంట్లో అందికీ వస్తుందనే సూచనలు తమ వారికే చెబుతున్నారు. అలాంటి వారి పరిస్థితి గమనించి సేవాభారతి సభ్యులు వారిని అక్కున చేర్చుకుంటున్నది. ఆర్ఎస్ఎస్లో ఓ విభాగమైన సేవాభారతి సభ్యులు సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని సరస్వతీ శిశు మందిరంలో కొవిడ్ బారిన పడిన వారికి భరోసానిచ్చేలా ఉచితంగా ఐసొలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వారికి ఉదయం టిఫిన్తో పాటు మరో రెండు పూటలు భోజనాన్ని కూడా ఉచితంగా అందించి వారికి అండగా ఉంటున్నారు.
ఉచిత ఐసొలేషన్ సెంటర్..
ఆర్ఎస్ఎస్లోని ఓ భాగమైన సేవాభారతి జిల్లా కన్వీనర్ అంబరీష్, కో-కన్వీనర్ వీరారెడ్డి తమ పూర్వవిద్యార్థుల సహకారంతో ఫసల్వాదిలోని శిశుమందిరంలో మొత్తం 30-40 మంది వరకు ఉండేలా ఉచిత ఐసొలేషన్ సెంటర్ను గత నెల 29న ప్రారంభించారు. మే 2న ఇక్కడికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే కాకుండా బీదర్ నుంచి ఒకరు మొత్తం 27మంది ఈ సెంటర్కు వచ్చారు. ఇందులో 9మంది పూర్తిగా కోలుకొని, స్వగృహాలకు వెళ్లారు. ఈ కేంద్రంలో రోజు ఉదయం 6.30 నుంచి 7.30 వరకు కొవిడ్ రోగులతో యోగా చేయిస్తారు. అనంతరం వారికి పసుపు కలిపిన పాలు ఇస్తారు. తర్వాత ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి ఉచితంగా భోజనం అందజేస్తున్నారు. బాధితులకు రెండు పూటలా అక్కడే ప్రత్యేకంగా తయారు చేసిన కషాయాన్ని ఇస్తున్నారు. అయితే ఈ కేంద్రంలో ఉన్న రోగులకు అందించే భోజనం మొత్తాన్ని సంగారెడ్డిలోని ఓ ఇంటిలో భోజనాన్ని తయారు చేయిస్తున్నారు.
కేర్ టేకర్ ఉండాల్సిందే…
సేవాభారతి ద్వారా ఏర్పాటు చేసిన ఈ ఐసోలేషన్ కేంద్రంలో కొవిడ్ రోగితో పాటు అతడి సంబంధీకులు ఎవరైనా ఒకరు ఇక్కడ ఉండాలని నిర్వాహకులు చెబుతున్నారు. రోగులతో పాటు వచ్చిన కేర్టేకర్లు(కుటుంబీకులు)కు అక్కడే మరోచోట వసతిని కల్పించారు. వారికి కూడా మూడు పూటలా భోజనం ఉచితంగా అందజేస్తున్నారు. రోజూ ఇక్కడ 10మంది సిబ్బంది ప్రత్యేకంగా పని చేస్తున్నారు. ఐసొలేషన్ కోసం వచ్చే బాధితులు డాక్టర్ సూచించిన మెడికల్ కిట్లు వారే తమవెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఇక్కడ ఐసోలేషన్ కోసం రావాలనుకుంటే 9441038729(అంబరీష్), 9490221753(వీరారెడ్డి)కు సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచించారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
మా వద్ద వచ్చే కొవిడ్ రోగుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశాం. ఒక్కో గదిలో ముగ్గురు లేదా నలుగురు ఉంటారు. మొత్తం 30-40 మంది వరకు ఉండేందుకు ఇక్కడ వీలు ఉంది. ఇప్పటికే మా వద్ద ఐసొలేషన్ అయిన వారిలో 9మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇండ్లకు వెళ్లారు. ఇక్కడ ఉన్న వారికి మూడు పూటలా ఆక్సిజన్, ఇతర పల్స్ చెకప్ చేస్తున్నాం. అలాగే, స్థానిక వైద్యుడి ద్వారా రెండు పూటలా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నాం. నాతోపాటు స్వామి, ముత్యంకృష్ణ మరో ముగ్గురు సిబ్బంది రోజు ఇక్కడే ఉండే వారి బాగోగులు చూసుకుంటున్నాం. ఇక్కడే చదివిన పూర్వవిద్యార్థులు, ఇతర దాతల సహకారంతోనే ఇదంతా చేయగలుగుతున్నాం. కొవిడ్ రోగులకు భయాన్ని వీడేలా వారికి ప్రత్యేకంగా ధైర్యాన్ని కల్పిస్తున్నాం.