సంగారెడ్డి, మే 17: ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకున్న కరోనా బాధితులకు ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఉచిత ఆహార పంపిణీ సహాయ కేంద్రం వాహనాలను అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని మంజీరా, కేబీఆర్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చికిత్సలు పొందుతున్న కరోనా బాధితులకు ఉచిత భోజన వసతి ఎంతో ఊరట కలుగుతుందన్నారు. భోజనం అవసరమున్న కొవిడ్ బాధితులు ఎలాంటి సందేహాలు లేకుండా సహాయ కేంద్రం ఫోన్ 7207488745 నెంబర్కు ఫోన్ చేసి తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. బాధితులకు నేరుగా ఇంటి వద్దనే భోజనం ప్యాకెట్లను అందిస్తారని, అందుకోసం వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే, మందులు అవసరమున్న వారు భోజనం కోసం ఫోన్ చేసినప్పు డు మందుల వివరాలు తెలిపితే మందు లు కూడా సరఫరా చేస్తామని వెల్లడించారు. పట్టణ పరిధిలోని దవాఖానల్లో ఐసొలేషన్లో ఉన్న బాధితులకు పౌష్టికాహారంతో కూడిన ఉచిత భోజనం అందిస్తారన్నారు. తొలిరోజు సుమారు 200 వందల భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో రాధిక రమణి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి పాల్గొన్నారు.
పరిశ్రమ యాజమాన్యాల సేవలు భేష్
జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు పరిశ్రమ యాజమాన్యాలు ముందుకు రావడం సంతోషకరమని అదనపు కలెక్టర్ రాజర్షి షా హర్షం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ చాంబర్లో న్యూలాండ్ ల్యాబొరేటరీస్ యజమాన్యం 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 2వేల ఎన్-95 మాస్కులు, కోకా కోలా 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్లను పరిశ్రమల ప్రతినిధులు అదనపు కలెక్టర్కు విరాళంగా బహూకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ప్రతినిధులు జిల్లా ప్రజల సౌకర్యానికి అందజేసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్లను జిల్లా దవాఖాన, ఏరియా దవాఖానలకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో గాయత్రిదేవి, డాక్టర్ శశాంక్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ప్రతినిధులు సుందర్, శ్రీనివాస్రెడ్డి, శ్రీరామ్, డాక్టర్ రవి, రఘు, కోకా కోలా పరిశ్రమ ప్రతినిధులు వెంకటేశ్వర్రావు, పార్ధసారథి, రెడ్క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వనజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
కరోనా బారిన పడిన పోలీస్ అధికారులకు అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ను అందించడానికి ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ ఎంతో అవసరపడుతాయని ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో న్యూలాండ్ ల్యాబొరేటరీస్ 2 ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్, కోకా కోలా కంపెనీ ఒక ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ను ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్పీకి అందజేశారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, న్యూలాండ్ ప్రతినిధులు రఘునాథ్, విజయ్ కుమార్బాబు, చందర్, ప్రసాద్, వీర కుమార్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.