ఎర్రటెండల్లో చెరువుల్లో జలకళ
చెరువులు నింపకుంటే జిల్లాలో సగం పంటలు ఎండిపోయేవి
జిల్లాలో 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ
చిన్నకోడూరు, ఏప్రిల్ 17 : సీఎం కేసీఆర్ ఆలోచనంతా రైతు సంక్షేమమే.. ఎర్రటి ఎండల్లో గోదావరి జలాలతో చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు పరవళ్లు తొక్కుతున్నాయని, పంట చేతికొచ్చే సమయంలో చెరువులను నింపకుంటే పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉండేదని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ అన్నారు. చిన్నకోడూరు మండలం మైలారం, ఇబ్రహీంనగర్, అనంతసాగర్ తదితర గ్రామాల్లో జడ్పీ సీఈవో సుమతితో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 325 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ముంగింట్లోనే విక్రయించుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉన్నందున రైతులు తప్పకుండా మాస్క్లు ధరించాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,888 మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుంద న్నారు.
మహిళా భవనం నిర్మాణానికి రూ.10 లక్షలు
చిన్నకోడూరు మండలం మైలారం మహిళా భవనం నిర్మాణానికి మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ను మహిళా సంఘం సభ్యులకు అందజేయడం జరిగిందని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాల్వ ఎల్లయ్య మాట్లాడుతూ ఇటీవల మహిళా సంఘం భవనం చిన్నగా ఉందని మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లడంతో జడ్పీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయాలని సూచించిన వెంటనే జడ్పీ చైర్పర్సన్ మంజూరు చేసినందుకు మంత్రి హరీశ్రావు, జడ్పీ చైర్పర్సన్కు మహిళా సంఘం సభ్యుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కీసరి పాప య్య, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, మండల వ్యవసాయ అధికారి గోవర్దన్, సర్పంచ్లు కాల్వ ఎల్లయ్య, నెమలి సుభాష్, ఎంపీటీసీ జ్యోతిచంద్రం, నాయకులు దేవయ్య, కుమార్, శ్రీనివాస్, ఐకేపీ నిర్వాహకులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.