సంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ) : త్వరలోనే ప్రభుత్వ దవాఖానలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ప్రభుత్వ దవాఖానలపై రోగులకు భరోసా పెరిగేలా వైద్యులు,సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని, జిల్లాల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు దవాఖానల్లో రూ.2వేలకే సీటీస్కాన్ చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. శుక్రవారం ఆర్థిక మంత్రి హరీశ్రావు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో కరోనా తీవ్రత, లాక్డౌన్ అమలు గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రజ లు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు సూ చించారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కొరత లేకుం డా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లోని కరోనా రోగులకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు దవాఖానలకు రెమిడెసివిర్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రెమిడెసివిర్ ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు దృష్టికి వస్తే పీడీయాక్టు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఇంటింటా సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తే, వెంటనే వారిని ఐసొలేషన్లో ఉంచి కరోనా కిట్ అందజేయాలని సూచించారు. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని వైద్యాధికారులకు సూచించారు.
హోం ఐసొలేషన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన వైద్య సహాయం అందజేయాలని సం గారెడ్డి జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్వో గాయత్రీదేవిని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా ఆక్సిజన్ కొర త రావద్దని, ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. కరోనా వేళ రూ.2 వేలకు స్కానింగ్ చేసేందుకు ముందు కొచ్చిన స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను మంత్రి హరీశ్రావు అభినందించారు. టెలీ కాన్ఫరెన్స్లో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీఎంహెచ్వో గాయత్రీదేవి, డీసీహెచ్ఎస్ సంగారెడ్డి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజుగౌడ్, ఆర్డీవోలు, సీటీస్కానింగ్ నిర్వాహకులు పాల్గొన్నారు.