సంగారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 15 : జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలు దాదాపుగా అన్నీ కూడా అనుమతుల కోసం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని, ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తామని డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి అన్నారు. శనివారం డీఎంహెచ్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 28 ప్రైవేట్ దవాఖానలకు కొవిడ్ చికిత్స కోసం అనుమతి ఇచ్చామని తెలిపారు. వీటిపై పర్యవేక్షణ కోసం కలెక్టర్ ఆదేశాల ప్రకారం 5 మంది అధికారులను నియమించామన్నారు. వారు ప్రతిరోజు దవాఖానలను పర్యవేక్షించి సమాచారం తెలియజేస్తున్నరన్నారు. జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని బోర్డు పెట్టుకుని ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని వెల్లడించారు.
ఆర్ఎంపీ, పీఎంపీలకు
ప్రభుత్వ గుర్తింపు కార్డులు..
ఆర్ఎంపీ, పీఎంపీలకు జిల్లా దవాఖానల్లో ప్రభుత్వం శిక్షణ ఇచ్చి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్తో గు ర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. జిల్లా దవాఖానలో శిక్షణ చేసిన గుర్తింపు కార్డు లేకుండా, బెడ్స్ వేసి తమ పరిధి కంటే ఎక్కువ చికిత్స చేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు రెండుసార్లు లేఖలు రాశామని తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలు, క్లీనిక్లు, డెంటల్ క్లీనిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరపీ క్లీనిక్లు, అల్లోపతిక్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు 2002 ప్రకారం ఈ నెల 31 వ తేదీ వరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.