7207488745 నెంబర్కు ఫోన్చేసి పేర్లు నమోదు చేసుకోవాలి
హోం ఐసొలేషన్లో ఉన్న బాధితులు వినియోగించుకోవాలి
టెలీకాన్ఫరెన్స్లో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి, మే 15 : కరోనా బాధితులు ఎవరూ కూడా భోజనానికి ఇబ్బంది పడొద్దని, వారి ఇంటికే పౌష్టికాహార భోజనం సరఫరా చేస్తామని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శనివారం జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఉచిత భోజనం పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అక్షయపాత్ర సహకారంతో ఆహార ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నట్లు ఇందుకోసం ఇద్దరు సూపరింటెండెంట్ అధికారులను నియమించామని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా విజృంభణతో పలు కుటుంబాలు కరోనా బారినపడి హోంఐసొలేషన్లో ఉన్నా వంట చేసుకునే స్థితిలో లేని వారు, ఇంటిల్లిపాది కొవిడ్తో బాధపడుతున్న వారు ఉచిత భోజన సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. బాధితులు వెంటనే తమ పేర్ల నమోదుకు ఆహార సహాయ కేంద్రం మొబైల్ నెంబర్ 7207488745కు ఫోన్ చేయాలని, ఈ నెల 16 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఫోన్ చేయాలన్నారు. ఈ అవకాశాన్ని సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఐసొలేషన్లో ఉన్న కొవిడ్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
4 ఎలక్ట్రికల్ ఆటో వాహనాలు ఏర్పాటు…
కరోనా బాధితులు వంట చేసుకునే పరిస్థితిలేని వారికి వెనకబడిన సంక్షేమశాఖ నుంచి ఉచితంగా పౌష్టికాహార భోజనం సరఫరా చేసేందుకు 4 ఎలక్ట్రికల్ ఆటోలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పేర్లను నమోదు చేసుకున్న వారి వివరాలను మున్సిపాలిటీ సిబ్బంది రూట్మ్యాప్ చేస్తారని, ఆ మేరకు బాధితులకు సకాలంలో భోజనం అందిస్తారన్నారు. బాధితులకు సవ్యంగా భోజనం అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీసీ సంక్షేమాధికారి కేషురాంను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్లో జిల్లా బీసీ సంక్షేమ అధికారి కేశురాం, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు శ్రీమాన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.