సంగారెడ్డి, మే 13: ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం రెండు రోజు లాక్డౌన్ పరిస్థితిని డీఎస్పీ బాలాజీ పర్యవేక్షించారు. 10 గంటల తరువాత తిరుగుతున్న వాహనాలను నిలిపి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడికి వెళ్లిన విషయాలను అడిగి తెలుసుకుంటూ అనుమానం వచ్చిన వాహనదారులను ప్రశ్నిస్తున్నారు. కొత్త బస్టాండ్ ఎదుట రహదారిపై రెండు వైపులా భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను వరుస క్రమంలో పంపిస్తున్నారు. పట్టణంలోని కొత్త, పాత బస్టాండ్ల ప్రాంతాల్లో దుకాణ సముదాయాలకు మూతపడ్డాయి. దుకాణదారులు లాక్డౌన్కు స్వచ్ఛందంగా సహకరిస్తూ వ్యాపార సంస్థలను మూసి వేశారు.
డీఎస్పీ బాలాజీ కొత్త బస్టాండ్ ఎదుట రహదారిపై ద్విచక్ర వాహదారులు, కార్లు ఇతర వాహనాలపై ప్రయాణిస్తున్న వాహనదారులను ప్రశ్నిస్తూ అనవసరంగా రోడ్లపై తిరగొద్దని లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి కరోనా నియంత్రణ చేసేందుకు లాక్డౌన్ నిర్ణయం తీసుకుని ప్రకటించిందన్నారు. అత్యవసర సేవలు అవసరమైన వారు గుర్తింపు కార్డులు, పని చేసి యజమాన్యాల కార్డులు చూపిస్తేనే పంపిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా వైద్య సేవలు, చికిత్స పొదుతున్న వారు పోలీసులు తనిఖీలు చేసేటప్పుడు సహకరించాలని డీఎస్పీ సూచించారు. తనిఖీల్లో పట్టణ ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
అవసరం ఉంటేనే బయటకు రావాలి : డీఎస్పీ
లాక్డౌన్ సమయంలో ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సూచించారు. గురువారం లాక్డౌన్ రెండో రోజు సదాశివపేటలో పర్యటించి లాక్డౌన్ తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం లాక్డౌన్ విధించిందన్నారు. ప్రజలు ఎలాంటి పనులు లేకుంటే ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసరంగా బయటకు వెళ్లేవారు తప్పకుండా సంస్థ ఇచ్చిన ఐడీ కార్డులను వెంట తెచ్చుకోవాలని, దూర ప్రాంతాలకు వెళ్తే ఆన్లైన్ ద్వారా మంజూరు పాస్లను అందిస్తున్నామన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు భౌతిక దూరం పాటిస్తూ పండుగను జరుపుకోవాలన్నారు. కాగా, సదాశివపేటలో ప్రజలు పూర్తిస్థాయిలో లాక్డౌన్ పాటించారు. దుకాణాలు, వర్తక, వాణిజ్య సముదాయాలు మూసి వేశారు. డీఎస్పీ వెంట సీఐ సంతోష్కుమార్ ఉన్నారు.
కొనసాగుతున్న లాక్డౌన్ నిబంధనలు
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో మున్సిపాలిటీలో ప్రధాన రోడ్లతో పాటు వీధులన్నీ రెండోరోజూ గురువారం నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. 10గంటల వరకు రవాణా, వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. తరువాత అన్ని మూసివేశారు.
రెండోరోజూ ప్రశాంతంగా లాక్డౌన్
రెండోరోజూ లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. మండల ప్రజలు లాక్డౌన్కు సంఘీభావం తెలుపడంతో లాక్డౌన్ సక్సెస్ అవుతుందని ఎస్సై విజయకృష్ణ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే క్రమంలో ప్రజలు దుకాణాల వద్ద క్రయవిక్రయాలు చేశారు. గుమ్మడిదల, కానుకుంట, కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10 గంటల నుంచి లాక్డౌన్ కావడంతో ఆ సమయంలో ఎవరూ బయటకు రాలేదు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే తప్ప ప్రజలు బయటకు రావడంలేదని ఎస్సై తెలిపారు.